జగన్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణపై కేసు నమోదు
ఈ నెల 13వ తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఫీజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె ఈ దీక్ష కోసం వెళ్తూ హనుమాన్ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగారు. అప్పుడు ఆమెను కలిసేందుకు వంగవీటి రాధా మరో పార్టీ నేత దుట్టా రామచంద్ర రావు ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో రాధ తన పూర్వ అనుచరుడు కొమళ్ల రవి కుమార్ను కులం పేరుతో దూషించినట్లుగా హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వంగవీటి రాధాతో పాటు మరో నలుగురి పైన కూడా ఈ కేసు నమోదైంది. వంగవీటి రాధాకృష్ణ తొలి నుండి కాంగ్రెసులో ఉన్నారు.
ఆ తర్వాత 2008లో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో విలీనం చేయడంతో రాధా వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అప్పటి నుండి జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు.