ఎన్టీఆర్ తెలియకే: జగన్పై బాబు, కుటుంబ విభేదాలపై..
తమది పెద్ద కుటుంబం కావడంతో కొన్ని బేధాభిప్రాయాలు రావడం సహజమేనని, అయితే కుటుంబం మొత్తం కలిసి ఉంటేనే పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు అన్నారు. గత సాధారణ ఎన్నికలలో చిరంజీవి కుటుంబం అంతా కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నదని, కానీ ఆయన ఓడిపోయారని, అదే వైయస్ రాజశేఖర రెడ్డి వెనుక కుటుంబం లేకున్నా గెలుపొందారన్నారు. సామాజిక సంస్కర్త అన్నా హజారే రాజకీయ పార్టీ పెట్టి తప్పు చేశారని, ఒక వ్యక్తిగా అవినీతిపై పోరాడితే మరో మహాత్మా గాంధీలా మిగిలి పోయేవారని, కానీ ఆయన పార్టీ పెట్టి జాతికి అన్యాయం చేశారన్నాలు.
స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతిలో ఉన్న గనులశాఖలో రూ. 1.86 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది చెప్పుకోవడానికే సిగ్గు చేటన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో 1.86 లక్షల కోట్లు, దానికి ముందు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో 1.76 లక్షల కోట్లు... రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రానికి, దేశానికి శాపంగా మారాయన్నారు. ప్రధాని పెద్దమనిషి అయితే కావొచ్చు గానీ, ఆయన అసమర్ధుడని, చుట్టూ దొంగలను పెట్టుకుని తాను మౌనమునిలా కళ్లు మూసుకుని కూర్చున్నాడని విమర్శించారు.
బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలపై కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ అవినీతిపరులైన మంత్రులు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నా ప్రధాని నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టారు. టిడిపి పాలనలో వ్యవసాయానికి కచ్చితంగా రోజకు 9 గంటలు కరెంట్ ఇచ్చేవారమని, ఇప్పుడు రోజుకు రెండు గంటలు కూడా రావట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కరెంటు సమస్యపైనే కాదు, ఏ శాఖపైనా అవగాహన లేదన్నారు. అందుకే ఆయన తనకు తెలిసిన క్రికెట్ మీద దృష్టిపెట్టి స్టేడియంకు వెళ్లిపోతున్నాడని ఎద్దేవా చేశారు.
ఈ అరాచక పాలన అంతం కావాలంటే విద్యావంతుల్లో చైతన్యం రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల తరువాత టిడిపి తన విధానాలను మార్చుకుందని, సామాజిక న్యాయమే నినాదంగా ముందుకెళ్తోందని చంద్రబాబు తెలిపారు. తాము ప్రవేశపెట్టిన బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోందన్నారు. ముస్లింల ఆర్థికాభివృద్ధికి, అగ్రవర్ణ పేదలకు కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు.