పెళ్లి టైంలో అర్థరాత్రి వరుడు పరారీ: తాళి కట్టిన అతిథి

వెంకటేష్ బెంగళూర్లో పిజ్జా తయారుచేసి విక్రయిస్తున్నాడు. నిశ్చితార్థం కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొని అమ్మాయి చేతికి ఉంగరం కూడా తొడిగి అమ్మాయి నచ్చిందని అందరిముందూ ప్రకటించాడు. ఈ రెండు కుటుంబాలు వివాహ ఏర్పాట్లు చేపట్టి, ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. సుకన్య-వెంకటేష్ల వివాహం అమింజికరైలో వున్న కార్పొరేషన్ సముదాయ భవనంలో ఆదివారం ఉదయం శుభముహూర్తంలో జరుగుతుందని ఆహ్వాన పత్రికలలో ముద్రించారు.
శనివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో వరుడు వెంటేష్ తమ స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులతో పాల్గొన్నాడు. ఆదివారం వేకువజామున 2.30 గంటలకు స్నేహితులతో కలిసి వెంకటేష్ కారులో బయటకు వెళ్లాడు. ఉదయం 9 గంటల వరకు వరుడికోసం ఎదురుచూశారు. ముహూర్త సమయం దగ్గరపడుతున్నా వరుడు రాకపోయే సరికి నిశ్చేష్టులైన వధువు ఇంటివారు వరుడి గదిని పరిశీలించగా అందులో అతనికి సంబంధించిన ఒక్క వస్తువు కూడా లేకపోవడం చూసి పరారైనట్టు గ్రహించారు. దీంతో వరుని తల్లిదండ్రులు కూడా ఏమి చేయాలో పాలుబోక కళ్యాణ మండపంలో ఏడుస్తూ ఉదయం వరకు గడిపారు.
ఈ నేపథ్యంలో పెళ్లికి వచ్చిన మధురవాయల్కు చెందిన సుధీర్కుమార్ సుకన్యమెడలో తాళికట్టేందుకు ముందుకొచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో ముందే నిర్ణయించిన ముహూర్తసమయం ఉదయం 10.30 గంటలకు సుధీర్కుమార్-సుకన్యల వివాహం హిందూసంప్రదాయ బద్దంగా జరిగింది. దీనిపై సుకన్య మాట్లాడుతూ, జరిగిన సంఘటనను చెడు కలగా భావిస్తానని, పెద్దల ముందు తన మెడలో మూడు ముళ్లు వేసిన సుధీర్తో జీవనం సాగిస్తానని ఆమె పేర్కొన్నారు. వెంకటేష్ పైన వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications