తెలంగాణపై ఆజాద్ నోట పాత పాటే: చర్చల స్థాయిలోనే

ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మారుస్తున్నట్లుగా అధిష్ఠానం ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. వీరిద్దరిని మారుస్తున్నట్లుగా రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తుంటే దానికి అధిష్ఠానం బాధ్యత ఏముంటుందని ఆజాద్ ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యువజన కాంగ్రెస్ పూర్వ కార్యకర్తలతో రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు నిర్వహించిన మేధోమథన కార్యక్రమం మంచిదేనని, ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. ఆజాద్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు కూడా పక్కనే ఉన్నారు.
లేక్వ్యూ గెస్ట్హౌస్లో బస చేసిన ఆజాద్ను ఆదివారం రాత్రి సీఎం కిరణ్కుమార్రెడ్డి కలిశారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. తర్వాత ఆజాద్తో సీఎం కిరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ఆదివారం రాత్రి బాగా పొద్దుపోయేవరకు కొనసాగింది. వీరి మధ్య రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశం, పార్టీ పరిస్థితి, పాలన వ్యవహారాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు నేపథ్యంలో ఏమిచేయాలన్న అంశంపై కూడా వీరు చర్చించినట్లు తెలిసింది.
నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చకు అడ్డుకట్ట వేయకపోతే కష్టమని ముఖ్యమంత్రి చెప్పారని, అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు తనకు అవకాశమిస్తేనే పూర్తి సామర్థ్యం మేరకు పని చేయగలుగుతానని విజ్ఞప్తి చేశారని తెలిసింది. తెలంగాణ అంశంపై పార్టీ వైఖరిని వెంటనే స్పష్టం చేయాలని కూడా సీఎం కోరినట్లు సమాచారం. రాష్ట్ర వ్యవహారాలపై తనకు అందిన సమాచారం మేరకు సీఎంను ఆజాద్ పలు ప్రశ్నలు అడిగారు. సీఎం చెప్పిన విషయాలను సావధానంగా విన్న ఆజాద్.. సోనియాతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని కిరణ్కు చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications