లోకేష్ కోసం ఎన్టీఆర్ను పక్కన పెట్టారు: లక్ష్మీపార్వతి
తెలుగువాళ్లంతా కలిసి ఉండాలని ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఎన్టీ రామారావు ఆశయానికి తూట్లు పొడుస్తూ విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ముక్కలు చేస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు అధికారం ముఖ్యమని భావించి, స్వార్థం కోసం తెలంగాణ కార్డును వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు తెలంగాణపై చంద్రబాబుదే తుది నిర్ణయమని అంటున్నారు. చంద్రబాబు కొంత మంది సీమాంధ్ర నాయకులతో గురువారం మంతనాలు జరిపారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని కోవ్వూరు శానససభ్యుడు రామారావు చంద్రబాబును కోరారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణకు తాము అంగీకరిస్తున్నామని, ఇందుకు తమ ప్రాంత ప్రజలను ఒప్పిస్తామని ఆయన చెప్పారు.
గొడవతో కలిసి ఉండడం కన్నా విడిపోయి కలిసి ఉంటామని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలయితే తమది జాతీయ పార్టీ అవుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు కలిసి ఉండాలని కోరుకుంటున్నారని, అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.