తెలంగాణ మంత్రులను నమ్మలేం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తనతో పాటు ఐదుగురు మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తామంటూ తెలంగాణ మంత్రులు కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రులు రాసే లేఖను సోనియా గాంధీ చదువుతారా అని అయన అడిగారు. ఉద్యోగులను చూసి తెలంగాణ మంత్రులు తల దించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను నమ్మితే మళ్లీ మోసపోవడం ఖాయమని ఆయన అన్నారు.
తెలంగాణ అనుకూలంగా లేఖ ఇస్తామని తెలుగుదశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊరిస్తున్నారని తెలంగాణ నగారా సమితి నాయకుడు, శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఇప్పుడే లేఖ ఇవ్వడానికి కారణాలు ఏమిటో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు చెందిన 20 మంది శాసనసభ్యులు ఏకమైతే తెలంగాణ వస్తుందని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. తెలంగాణ కోసం దొంగలను కూడా కలుపుతానని ఆయన అన్నారు.
తెలంగాణను అడ్డుకుంటామని సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బహిరంగంగానే చెబుతున్నారని, అయినా తెలంగాణ మంత్రులు నోరు విప్పడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ఎందుకు నోరు విప్పడం లేదో తెలంగాణ మంత్రులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాకుండా మజ్లీస్ పార్టీ లాబీయింగ్ చేస్తోందని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే ముస్లింల జీవితాలు బాగుపడతాయని ఆయన అన్నారు. వేయి మంది చంద్రబాబులు, అసదుద్దీన్లు అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఎలా తెచ్చుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు, మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ గురువారంనాడు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను ఢిల్లీలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సల్స్ సమస్యకు ముడిపెట్టడంపై వారు సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడారు. తాను అలా అనలేదని సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు భేటీ అనంతరం వినోద్ కుమార్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై తాము చర్చలు జరుపుతున్నట్లు షిండే తెలిపారని ఆయన అన్నారు.