యుపిఏపై మళ్లీ ఒంటికాలిపై లేచిన మమతా బెనర్జీ

బెంగాల్లో బంద్ పూర్తిగా విఫలమైందని, వామపక్షాల బందు పిలుపు లెక్క చేయకుండా ఉద్యోగులు విధులకు హాజరయ్యారని మమత చెప్పారు. యూపిఏ తీసుకున్న విదేశీ పెట్టుబడుల (ఎఫ్డిఐ) నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. రాజీనామాపై తమ పార్టీ కేంద్రమంత్రులు వెనక్కి తగ్గరన్నారు. ఎఫ్డిఐ వివాదంలోకి మమతా బెనర్జీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా లాగడం విశేషం.
కేంద్రం ఎఫ్డిఐపై, పెట్రో భారంపై వెనక్కి తగ్గని పక్షంలో శుక్రవారం ప్రధానమంత్రికి మంత్రులు రాజీనామాలు సమర్పిస్తారని చెప్పారు. యూపిఏ-2 ప్రభుత్వం అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని అన్నారు. రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులు ఒప్పుకుంటే భారత్ పైన పెను ప్రభావం పడుతుందన్నారు. తాను రాష్ట్రపతి అపాయింటుమెంటు తీసుకున్నానని, కలిసి అన్నీ వివరిస్తానని చెప్పారు. తన ఫోన్ను ట్యాప్ చేశారని మమత ఆరోపించారు.
బంద్ విజయవంతం.. గడ్కరీ
అఖిలపక్ష బంద్ విజయవంతమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఢిల్లీలో అన్నారు. బందుకు అన్ని ప్రాంతాల ప్రజలు సహకరించారని చెప్పారు. కేంద్రం డీజిల్ ధరల పెంపును, గ్యాస్ నియంత్రణను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్డిఐలను ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విదేశీ పెట్టుబడులతో చిల్లర వర్తకం దెబ్బతింటుందన్నారు. యూపిఏ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.












Click it and Unblock the Notifications