తెలంగాణాలో ఆ గ్రామానికి గ్యాస్ చింతే లేదు.. ఎందుకంటే!
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు నడుమ భారతదేశంలో ఇంధన కొరత నెలకొంది. ఇంధన సరఫరా తగ్గి, డిమాండ్ విపరీతంగా పెరగటం తో గ్యాస్ సిలిండర్ లు బుక్ చేసుకున్నా సరే, సకాలంలో గ్యాస్ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు డెలివరీలు కూడా చేయలేక ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.
గ్యాస్ కోసం తెలంగాణా జిల్లాల ఆందోళన
ఎక్కడా గృహ అవసరాలకు సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ, బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు సమయానికి రాకపోవడంతో ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతుంది. అనేక జిల్లాలలో గ్యాస్ కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. ఇంట్లో మహిళలు కూడా గ్యాస్ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సొంతూరిలో గ్యాస్ సమస్య లేదు
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ గ్యాస్ పైన ఆందోళన కొనసాగుతుండగా, ఒక్క గ్రామంలో మాత్రం గ్యాస్ కొరత సమస్య లేదు. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రజలకు గ్యాస్ కు సంబంధించి ఎటువంటి చింతా లేదు. రాష్ట్రమంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, సీఎం సొంతూరులో ఎందుకు గ్యాస్ సమస్య లేదనేది ప్రతి ఒక్కరికి ఉత్పన్నం అవుతున్న ప్రశ్న.
కొండారెడ్డి పల్లిలో సోలార్ పథకం
ఎందుకంటే సీఎం సొంతూరైన కొండారెడ్డిపల్లి లో గ్యాస్ వినియోగం కన్నా ఇండక్షన్ స్టవ్ ల వాడకమే ఎక్కువ. రెండు సంవత్సరాల క్రింద టీజీ రెడ్కో ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ పథకం అమలు చేశారు. ఇందులో భాగంగా కొండారెడ్డిపల్లి గ్రామంలోని మొత్తం 514ఇళ్లకు, ఒక్కొక్క ఇంటి పైన మూడు కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్ ను బిగించారు. మొత్తం 10.53కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్యానల్స్ ను బిగించారు.
సోలార్ ప్యానల్స్ బిగించడానికి, గ్యాస్ కొరత లేకపోవడానికి లింక్
ఈ ప్యానల్స్ ద్వారా ప్రతి ఇంటిపైన నెలకు సగటున 360కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ విద్యుత్ ను గ్రామస్తులు తమ ఇంటి అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు పంపి అదనంగా ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే సోలార్ ప్యానల్స్ బిగించడానికి, గ్యాస్ కొరత లేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది.
ఈ కుకింగ్ చేస్తున్న కొండారెడ్డిపల్లి వాసులు
సోలార్ పవర్ ను గరిష్టంగా వినియోగించుకొని ఈ కుకింగ్ ను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం గత సంవత్సరం ప్రతి ఇంటికి ఇండక్షన్ స్టవ్, కుక్కర్ లను పంపిణీ చేసింది. ప్రస్తుతం గ్రామంలోని 410 కుటుంబాలు ఇండక్షన్ స్టవ్ లను పూర్తిస్థాయిలో వాడుతూ, గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించారు.
కొండారెడ్డిపల్లి గ్రామంలో గ్యాస్ కొరత సమస్య లేదు
మిగతావారు కూడా ఇండక్షన్ స్టవ్ లను వినియోగించేలా అధికారులు చైతన్యం తీసుకువస్తున్నారు. ఇక ఇండక్షన్ స్టవ్ ను వినియోగిస్తున్న క్రమంలో కొండారెడ్డి పల్లి గ్రామంలో గ్యాస్ కొరత సమస్య లేదు. దీంతో ఈ గ్రామం ఇప్పుడు గ్యాస్ కొరత లేని గ్రామంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications