ముందుగానే ఎన్నికలు, మద్దతుపై రేపు: మాయావతి
లోకసభ ఎన్నికలకు యుద్ధప్రాతిపదికపై సిద్ధం కావాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డిఐలను) అనుమతించడానికి తాము వ్యతిరేకమని ఆమె చెప్పారు. ఎఫ్డిఐల అనుమతి వల్ల రైతులు, లఘు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బ తింటారని అన్నారు. ఇంధన ధరలు పెంచి పేదలపై, సామాన్యులపై భారం వేయడానికి బదులు సంపన్నులపై పన్నులు విధించాల్సిందని ఆమె అన్నారు.
యుపిఎ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆమె విమర్శించారు. కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా ఇచ్చే సెలవును కూడా రద్దు చేసే స్థాయికి సమాజ్వాదీ ప్రభుత్వం దిగజారిందని ఆమె విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కక్షపూరిత రాజకీయాలను నడుపుతున్నారని దుయ్యబట్టారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, ఇతర దళిత నేతల పేర్ల మీద పథకాల పేర్లను కూడా మార్చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మాయావతి విమర్శించారు. హర్యానాలో దిళతులపై నేరాలు పెరగడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. తన ప్రభుత్వ హయాంలో మతఘర్షణలు జరగలేదని, గత ఆరు నెలల ఎస్పీ పాలనలో పది అల్లర్లు చోటు చేసుకున్నాయని ఆమె అన్నారు.