ఒకే ఒక్కడు: అందుకే చంద్రబాబు పాదయాత్ర
హైదరాబాద్: పార్టీని నిలబెట్టుకుని, అధికారంలోకి తెవాల్సిన అనివార్యతలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పడ్డారు. పార్టీ పరాజయానికైనా, విజయానికైనా బాధ్యత వహించేది ఆయన ఒక్కరే. పార్టీని అధికారంలోకి తేవాల్సిన అవసరం కూడా ఆయన ఒక్కరికే ఉంది. పార్టీని నిలబెట్టి, అధికారంలోకి తెస్తే తప్ప తన రాజకీయ మనుగడకు ఢోకా ఉండదు. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ దెబ్బ తింటే ఇక కోలుకోవడం కష్టమనే విషయం ఆయనకు తెలుసు. ఇప్పటికే రెండు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయి, నీరసపడిన పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది.
పాదయాత్రలో ఆయనకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. జలుబు వంటి సమస్యలు మాత్రమే కాకుండా కాళ్ల నొప్పులు కూడా పుడుతున్నాయని అంటున్నారు. దీంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. అయితే, అందుకు చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించడం లేదని, యాత్రను సాగించడానికే పట్టు పడుతున్నారని అంటున్నారు. ఇలాగే, యాత్ర సాగిస్తే చంద్రబాబుకు కష్టమేనని డాక్టర్ కోడెల శివప్రసాద్ వంటివారు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విశ్రాంతి తీసుకోవాలని, పాదయాత్రకు మధ్య మధ్యలో విరామం ఇవ్వాలని సూచిస్తున్న నాయకులకు ఆయన ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారని అంటున్నారు. చాలా దూరం నడవాల్సి ఉందని, విరామం ఇస్తే పాదయాత్ర పూర్తి చేయడం కష్టమని ఆయన చెబుతున్నారని వినికిడి. అంతేకాకుండా, ఈసారి పార్టీని గెలిపించకపోతే ఇబ్బందులు తప్పవని, మిగతా నాయకులకు ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలు ఉంటాయని, తనకు మాత్రం మరో ప్రత్యామ్నాయం ఉండదని, అందుకే పార్టీని విజయం దిశగా నడిపించాల్సిన బాధ్యత తనపైనే ఎక్కువగా పడిందని ఆయన వివరిస్తున్నట్లు చెబుతున్నారు.
2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతతో, ప్రతిపక్షాల పొత్తులతో ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కలిసి రాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. దానికన్నా ముఖ్యంగా, జయప్రకాష్ నారాయణ లోకసత్తా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఓట్లు చీలి తమ పార్టీకి నష్టం జరిగిందని ఒక అంచనాకు వచ్చారు. కొత్త పార్టీలు, చిన్న పార్టీలు తమ పార్టీనే దెబ్బ తీస్తుండడం పట్ల చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్గా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా కాంగ్రెసుకు సహకరించడానికి తమనే లక్ష్యం చేసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు కాంగ్రెసుతో కలిసి తమ పార్టీని దెబ్బ తీయడానికి వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నిస్తాయని చంద్రబాబు అనుమానిస్తున్నారు. పైగా, వామపక్షాలు, సిపిఐ మినహా, తమతో దోస్తీ కట్టడానికి సిద్ధంగా లేవు. ఈ స్థితిలో పార్టీని అధికారంలోకి తేవడానికి తీవ్రమైన కార్యాచరణకు దిగాల్సిన స్థితిలో చంద్రబాబు పడ్డారని అంటున్నారు. అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. ఏమైనా, పాదయాత్రనే కాకుండా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం చంద్రబాబుకు పెద్ద సవాలే.