బాబుపై బాంబు దాడి: ఇద్దరికి ఏడేళ్ల జైలు, సాగర్ నిర్దోషి
మరో ఇద్దరు నిందితులు సాగర్, గంగిరెడ్డిలపై ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా చెబుతూ విడుదల చేసింది. ఈ కేసులో శిక్ష పడిన, నిర్దోషులుగా పేర్కొన్న నలుగురిలో సాగర్ ఒక్కడే మాజీ మావోయిస్టు నేత. మిగిలిన ముగ్గురు బాంబు దాడిలో మావోయిస్టులకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే సాగర్, గంగిరెడ్డిలను దోషులుగా తేల్చేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది.
2003 అక్టోబర్ 1న నాటి ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుపతిలోని అలిపిరి వద్ద మావోయిస్టులు బాంబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు సజ్జల గోపాలకృష్ణ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు గాయపడ్డారు.
2004లో దీనిపై ఛార్జీషీటు నమోదయింది. 33 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. అందులో ఇరవై ఎనిమిది మందిని కనిపెట్టలేదు. మిగిలిన ఐదుగురిలో కేసు విచారణలో ఉండగా ఒకరు మృతి చెందారు. నలుగురిలో ఇప్పుడు ఇద్దరికి శిక్ష పడగా మర ఇద్దరికి విముక్తి కలిగింది. గతంలో నలుగురికి శిక్ష పడినప్పటికీ వీరు అప్పీల్కు వెళ్లారు.
న్యాయం గెలిచింది
న్యాయం గెలిచిందని నిర్దోషిగా బయటకు వచ్చిన సాగర్ అన్నారు. హైకోర్టుకు అప్పీల్ కోసం వెళ్లినా ఇదే తీర్పు వస్తుందన్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ అన్యాయంగా ఇరికించారన్నారు. న్యాయస్థానంలో తాను నిర్దేషిగా బయటపడ్డానన్నారు.