టిడిపి టార్గెట్ కెసిఆర్: తాజాగా మోత్కుపల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎన్ని అవతారాలు ఎత్తిన ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వంద సీట్లు, 17 ఎంపీలు అంటూ కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలే కారణమని మోత్కుపల్లి ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వలస వచ్చారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
గత ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తుపెట్టుకొని తెర వెనక కాంగ్రెస్ను గెలిపించిన ఘనుడు కెసిఆర్ అని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం దుయ్యబట్టారు. కేసీఆర్కు దమ్ముంటే బస్సు యాత్ర కాక, తమ అధినేతలా పాదయాత్రకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ విషయంలో కేసీఆర్ పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలుగుదేశం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కేసీఆర్ మాట్లాడాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ హెచ్చరించారు.
కాంగ్రెస్తో కుమ్మక్కై బ్లాక్మొయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
కేసీఆర్కు జ్ఞానోదయమైనట్టుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే జేఏసీ నుంచి తమను అకారణంగా జేఎసీ నుంచి బహిష్కరించిందని ధ్వజమెత్తారు. తన అజ్ఞానానికి, ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని పొలిట్బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications