ఇంతగా ఆగారు, కొంతకాలం ఆగలేరా:తెలంగాణపై షిండే
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ తనకు అందలేదని చెప్పారు. తెలంగాణపై ఇప్పటికే పూర్తి స్థాయి చర్చలు జరిగాయని, సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గతంలో అఖిల పక్ష సమావేశంలో కూడా తెలంగాణపై చర్చించామని షిండే గుర్తు చేశారు.
సూరజ్కుండ్ పార్టీ మేధోమథనం సదస్సులో తెలంగాణపై చర్చించలేదని, 10జనపథ్లో తెలంగాణపై చర్చించామని ఆయన తెలిపారు. తెలంగాణపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటామో చెప్పలేమని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశం పార్లమెంటు సమావేశాల సందర్భంగానైనా జరగవచ్చు, పార్లమెంటు సమావేశాల తర్వాతనైనా జరగవచ్చునని ఆయన అన్నారు.
సూరజ్కుండ్ మేధోమథన సదస్సు తర్వాత సోనియా గాంధీ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చించినట్లు సమాచారం. ఈ కోర్ కమిటీ సమావేశంలో పలు విషయాలు చర్చించామని షిండే చెప్పారు. శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తక్షణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరాన్ని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు.