ప్రధానితో భేటీ: రాజీనామాపై మొండికేసిన కావూరి

రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రధాని కావూరికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధాని మన్మోహన్ సింగ్ కావూరితో ఏం మాట్లాడరనేది తెలియదు. ప్రధానితో మాట్లాడిన విషయాలను చెప్పలేనని కావూరి భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, తాను రాజీనామాను కట్టుబడే ఉన్నానని, వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానిని కలిసిన తర్వాత కూడా తన వైఖరిలో మార్పులేదని అన్నారు.
పార్టీ తీరుపై తనకు ఇంకా అసంతృప్తి ఉందని కావూరి చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని అయన అన్నారు. మంత్రి వర్గంలో తనకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కావూరి సాంబశివ రావు ఇటీవల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు.
రాజీనామాను ఉపసంహరించజేసేందుకు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కావూరి సాంబశివ రావుతో మాట్లాడారు. పార్టీలో స్థానం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. అయినా, కావూరి సాంబశివ రావు వెనక్కి తగ్గలేదు. శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కావూరిని పిలిపించి మాట్లాడారు.
తనకన్నా జూనియర్లకు మంత్రివర్గంలో చేటు కల్పించి, మూడు దశాబ్దాల పాటు లోకసభ సభ్యుడిగా ఉన్న తనను నిర్లక్ష్యం చేయడంపై కావూరి సాంబశివ రావు పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. కావూరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉండిందని రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు కూడా.












Click it and Unblock the Notifications