ఎన్టీఆరే పేరు పెట్టారు, నాపొలానికీ: జగన్కి కిరణ్ కౌంటర్
హంద్రీనీవా ప్రాజెక్టు ఇప్పటిది కాదన్నారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆయన పూనుకున్నారని, దానికి హంద్రీనీవా సుజల స్రవంతి అని పేరు పెట్టింది కూడా ఆయనే అన్నారు. ఎమ్మెల్యేలుగా గెలవక ముందు నుండే హంద్రీనీవా మైలురాళ్లు ఉండేవని గుర్తు చేశారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి హయాంలో ప్రాజెక్టుపై నివేదిక తయారు చేయించారన్నారు. హంద్రీనీవా కోసం టిడిపి ఖర్చు చేసింది రూ.27 కోట్లే అన్నారు.
అందులోనూ విజయ భాస్కర రెడ్డి నివేదిక కోసం చేసిన ఖర్చే ఎక్కువగా ఉందన్నారు. ఆ తర్వాత హంద్రీనీవా చేపడుతామని చెప్పినప్పటికీ 2009 తర్వాతనే ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులు విడుదల చేశామన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ.3641 కోట్లు ఖర్చు పెట్టామని, సెకండ్ పేజ్ కోసం రూ.1468 కోట్లు ఇచ్చామన్నారు.
ఇప్పటికి రూ.5వేల కోట్లకు పైగా ఖర్చయిందన్నారు. ఇంకా ఖర్చు చేయాల్సింది చాలా ఉందన్నారు. ఒక్క రోజులో ఏ ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. ఒక్కరోజులో పూర్తి చేసేందుకు ఇది టిక్కెట్ తీసుకొని మూడు గంటల్లో సినిమా చూసినట్లు కాదని ఎద్దేవా చేశారు. ఒక ఇళ్లు కట్టుకోవాలంటేనే ఎంతో ఖర్చు, సమయం తీసుకుంటుందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో తన స్వార్థం కూడా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తన పొలానికి కూడా నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరి జీవితం శాశ్వతం కాదని, బతికున్నప్పుడే దేశానికి సేవ చేయాలన్నారు.
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకో హంద్రీనీవా ఎంతో అవసరమన్నారు. తన నియోజకవర్గానికి నీళ్లు వచ్చి పంట పొలాలు పచ్చగా మారుతాయన్నారు. ఇది ఓ బృహత్తర ప్రాజెక్టు అన్నారు. మొదటి దశలో 216 కిలోమీటర్ల మేర నీరు అందుతుందన్నారు. వెయ్యి అడుగుల మేర నీటి సరఫరా ఉంటుందన్నారు. 2014లోగా 50 లక్షల ఎకరాలకు జలయజ్ఞం కింద నీటిని అందిస్తామన్నారు. నీటి వాడకంలో పొదుపు పాటించాలని సూచించారు.