జగన్ పార్టీలోకి పయ్యావుల: తెరాస ఎమ్మెల్యేలూ...?
వచ్చే ఎన్నికల్లోపు టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని వారన్నారు. 20 మంది తెలుగుదేశం, నలుగురైదుగురు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యేలుంటారని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా జగన్ పార్టీలో చేరేందుకు ముందువరుసలో ఉన్నారని వెల్లడించారు. తమ పార్టీ ప్రభావంతో టీఆర్ఎస్, టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. తెలంగాణ కోసం అవసరమొచ్చినప్పుడే కేసీఆర్ ఉత్తర ప్రగల్భాలు పలుకుతుంటారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఎన్నికలకు ముందే జంపింగ్లు ఊపందుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయ రంగారావు, ఎం. రాజేశ్ ఇప్పటికే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తెలుగుదేశం శాసనసభ్యులు కొడాలి నాని, ప్రవీణ్ కుమార్రెడ్డి, అమర్నాథరెడ్డి, వనిత కూడా ఇదే దారి పట్టారు.
ఇప్పుడు పాలక పక్షానికే చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా వైయస్సార్ కాంగ్రెసు తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి జగన్ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి జగన్ను ఆకాశానికెత్తారు. అవసరం వచ్చినప్పుడు జగన్ నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పారు.
నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ను వీడే యోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటపెట్టడం విశేషం. "కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ప్రజాభీష్టం మేరకు వైసీపీలోకి వెళ్లాలని గుత్తా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే... నేను కూడా ఆయన వెంటే వెళతాను'' అని చెప్పేశారు.
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ కాంగ్రెస్కు కటీఫ్ చెప్పి, 'జగన్ నా ఫ్రెండు' అని ప్రకటించిన తర్వాత హైదరాబాద్లోనూ సమీకరణాలు మారిపోయాయి. నగరానికి చెందిన శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, స్వతంత్య్ర శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వారు తమ అనుచరులతో మంతనాలు కూడా జరుపుతున్నారని అంటున్నారు. వీరితో పాటు నగరానికి చెందిన బీసీ వర్గానికి చెందిన మరో శాసన సభ్యుడు కూడా కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ జాబితాలో మంత్రి ముఖేశ్ గౌడ్ పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం. ఎంఐఎం మద్దతు ఉపసంహరణతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి సమయంలో పాలక పక్షానికి చెందిన పలువురు శాసనసభ్యులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉండడం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.