రాజకీయాలను భ్రష్టు పట్టించారు: చిరంజీవిపై బాబు
సినిమా నటుడు చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించారని, సామాజిక న్యాయమంటూ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజల సంగతిని పక్కనపెట్టి తనకు న్యాయం జరిగేలా చూసుకున్నారని, మంత్రి పదవి కోసం పార్టీనే విలీనం చేశారని ఆయన దుయ్యబట్టారు. శాసనసభ్యులను పశువుల కన్నా హీనంగా రూ. 20 కోట్లకు కొనడమే విశ్వసనీయతనా అని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను ప్రశ్నించారు.
యాత్ర ప్రారంభించి 50 రోజులైన సందర్భంగా కేక్ కట్ చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుక్యా సంజీవనాయక్, విద్యార్థి నేత శంకర్ నాయక్ చంద్రబాబుకు 25 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. గిరిజన పిల్లలను కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని, ఇంటి జాగా ఇచ్చి, రూ.1.5 లక్షలతో ఇల్లు కట్టిస్తానని తండాల్లోని ఆడపిల్లల పెళ్లికి యాభై వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దళితుల బాగు కోసం పోరాడుతున్న ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రజలను చైతన్య పరిచి ప్రజాఉద్యమం నిర్మించేందుకు పవిత్రమైన మనసుతో వచ్చానని చంద్రబాబు అన్నారు. పది అడుగులు నాతో కలిసి రండని ఆయన కోరారు. మనకు కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయని, అధికారంలోకి తప్పకుండా వస్తామని, భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత మేర ప్రజల బాగు కోసం పనిచేస్తానని అన్నారు.
తమ అధినేత్రి సోనియా చెప్పినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వినే పరిస్థితి కనిపించడం లేదని , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇవ్వాలని ఆమె ఆదేశించినా సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. "ముఖ్యమంత్రి కిరికిరిరెడ్డి (కిరణ్కుమార్రెడ్డి), మాఫియా డాన్ బొత్స సత్యనారాయణలను మార్చే స్థితిలో సోనియాగాంధీ లేర'ని ఆయన అన్నారు. వారిద్దరూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నారు.