జగన్ పార్టీలోకి వెళ్లకుండా కోమటిరెడ్డికి కెకె బ్రేక్లు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. కెకెతో భేటీ తర్వాత జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కేశవ రావు కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. అయితే మీడియా ప్రతినిధులు మరీ పట్టుబట్టడంతో వివరాలు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు కేశవరావు తెలిపారు. తెలంగాణ సాధన కోసం తమతో కలిసి వస్తానని చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్వరలోని తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐక్య వేదికకు త్వరలోనే ఓ రూపం వస్తుందని కెకె చెప్పారు. ఒక రూపం వచ్చిన తర్వాత తెలంగాణ ఐక్య వేదిక వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. మూడేళ్లుగా ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు.
అలా అయితే జగన్ పార్టీలోకి వెళ్లరు
ఇదిలావుంటే, తెలంగాణను కోరుకునే వారు ఎవరు కూడా జగన్ పార్టీలోకి వెళ్లరని నిజామాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కి అన్నారు. అలా వెళ్లినవారు తెలంగాణ ద్రోహులేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవినీతి, అక్రమాలకు మారుపేరైన జగన్ పార్టీకి తెలంగాణలో చోటు ఉండదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణపై ఒత్తిడి తేవడానికి అవిశ్వాస తీర్మానాన్ని వాడకుంటామని యాష్కీ చెప్పారు.
తెలంగాణకు ప్యాకేజీలు, పదవులు అంటే సమస్యను నాన్చడమేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. పార్టీలు మారితే ఆయా పార్టీలు బలోపేతమవుతాయే తప్ప తెలంగాణ సమస్య పరిష్కారం కాదని యాష్కీ అన్నారు.