కావూరికి అండగా లగడపాటి: టికాంగ్ ఎంపీలకు హితవు
రేపటి నుండి సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, కావూరి రేపటి నుండి రాకపోయినప్పటికీ సోమవారం నుండి వస్తానని చెప్పారని తెలిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అధిష్టానానికి తెలంగాణ ప్రకటనపై డెడ్ లైన్లు విధించడం సరికాదన్నారు. తమ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలలో కొన్ని బేధాభిప్రాయాలు ఉండవచ్చునని అన్నారు.
ఎంపీలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడితే ఎలాంటి తప్పు లేదన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే అంశం పైనా లగడపాటి రాజగోపాల్ స్పందించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎవరూ పార్టీని వీడటం లేదన్నారు. మాకు అసెంబ్లీలో పూర్తి బలం ఉందన్నారు. అవిశ్వాసం పెట్టినా బలం నిరూపించుకుంటామని చెప్పారు.
మల్లాది విష్ణు, జోగు రమేష్ తదితర నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లనున్నారనే వార్తలు జోరుగా ఇటీవల వినిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కృష్ణా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. అయితే మార్పు వార్తలను పలువురు ఖండిస్తున్నారు.