జగన్ వైపుకు ఎందుకంటే..: జంప్లపై డికె అరుణ, టిజి
సీమాంధ్ర ప్రాంతంలో సీమాంధ్ర నేతలు, తెలంగాణలో మా ప్రాంత నేతలు తమ తమ అభివృద్ధికి కాంగ్రెసు పార్టీల నేతలు కృషి చేస్తున్నారన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కాంగ్రెసు పార్టీని వీడుతున్నది కేవలం తమ స్వార్థం కోసమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆమె అన్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు.
రైతులకు ధైర్యం చెప్పేందుకే తాను హంద్రీనీవా ప్రారంభమైనందున భగీరథ విజయ యాత్ర చేపట్టానని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. హంద్రీనీవా కారణంగా భవిష్యత్తు తరాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. వ్యవసాయం పైన యువత దృష్టి సారించాలని ఆయన సూచించారు. హంద్రీనీవా ప్రాజెక్టు చివరి ఫలితం వరకు తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణలో సెంటిమెంట్, సీమాంధ్రలో ఓదార్పుతో ఓట్లు పడతాయని కొందరు ప్రజాప్రతినిధులు భావించే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ హైదరాబాదులో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్న వారిపై ఆయన స్పందించారు. సెంటిమెంట్, ఓదార్పుకు ఓట్లు పడతాయని భావించడం వల్లే వలసల బాట పడుతున్నారని చెప్పారు.
ప్రజలకు నిలకడ మీద నిజాలు తెలుస్తాయని చెప్పారు. తెలంగాణలో గతంలో కంటే సెంటిమెంట్ తగ్గిందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు అభివృద్ధి జరుగుతుందని, ఎవరూ అడ్డుపడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణల వివాదం వారి వ్యక్తిగతమని చెప్పారు. 2014 వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
పార్టీని వీడితో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లే అన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఓ వర్గం నేతలే పార్టీని వీడుతున్నారని అన్నారు. వలసలు త్వరలో ఆగిపోతాయన్నారు. కాగా టిజి వెంకటేష్ మరో మంత్రి శైలజానాథ్లు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. బొత్స నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.