మార్పు మంత్రం: సొంత నేతలపై కిరణ్ ఆపరేషన్ ఆకర్ష్
అందుకు ఇటీవల నీలం తుఫాను ప్రభావిత ప్రాంతాలను చూసేందుకు వెళ్లిన సందర్భం ఓ నిదర్శనం. ఆ సమయంలో కిరణ్ మార్పు తప్పదంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఢిల్లీ లెవల్లో కూడా అస్పష్టమైన ప్రకటనలు కనిపించాయి. ఆ సమయంలో కిరణ్ ముభావంగా కనిపించారు. పర్యటనకు వెళ్లిన కిరణ్ పూర్తిగా నీలం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించకుండానే వచ్చారు. అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ మార్పులు ఉండయంటూ అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
దీంతో కిరణ్ దూకుడు మరోసారి పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఆదివారం ఆయనలో ఇందిర బాట కార్యక్రమంలో చూపించిన జోరు కనిపించింది. మెట్రో రైలు దిమ్మెలు ప్రారంభించిన తర్వాత ఉప్పల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిరణ్ ఉత్సాహంగా మాట్లాడారు. తనదైన శైలిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు. పలు కొత్త పథకాలు ప్రవేశ పెట్టారు.
2014 ఎన్నికలు లక్ష్యంగా ఆయన ఈ పథకాలను ప్రారంభించారు. అప్పటి వరకు ప్రజలను కాంగ్రెసు వైపు అలాగే తన వైపు మరల్చుకునే దృష్టితో ఆయన పని చేసుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది. పథకాలలో తన ముద్ర కనిపించేలా ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు అండతోనే తాను ముఖ్యమంత్రిగా అయ్యానని చెబుతూనే మరో పక్క తన ముద్ర కనిపించేలా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అదే సమయంలో పార్టీలోని ఇతర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయన పడ్డట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఆయన తీసుకునే నిర్ణయాలను తోటి మంత్రులు సైతం వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. తమను సంప్రదించడం లేదని పలువురు మంత్రులు పలు సందర్భాలలో తమ అసంతృప్తిని బయట పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రులను కలుపుకొని వెళుతున్నారని అంటున్నారు.
కిరణ్ ఆదివారం వాన్ పిక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాద రావును వెనుకేసుకొచ్చారు. ఓ మంత్రిగా ఏం చేయాలో ఆయన అప్పుడు అదే చేశారని చెప్పారు. మిగిలిన మంత్రులను కూడా కలుపుకొని వెళ్తున్నారని అంటున్నారు. అదే సమయంలో 2014లో కిరణ్కు పోటీగా కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి రేసులో ఉన్న కేంద్రమంత్రి చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు కూడా ఆయన పని తీరుకు కితాబిస్తున్నారు.
కిరణ్ మార్పు ఉంటుందని తెలుస్తే వారు మిన్నకుండే వారని, కానీ మార్పు ఇప్పుడు లేదని చెప్పడంతోనే బొత్స వంటి వారు కిరణ్ పట్ల వెనక్కి తగ్గారని అంటున్నారు. అయినా ఎన్నికలకు ఇంకో సంవత్సరంన్నర గడువున్నందున కిరణ్తో పెట్టుకొని గతంలో వలె అధిష్టానంతో క్లాస్ పీకించుకోవడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందని కిరణ్ ధీమాగా చెబుతున్నారు.
మార్పు వ్యవహారంతో రాష్ట్ర కాంగ్రెసు ఓ గాడిన పడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మార్పు ఉంటుందని భావించి ఇన్నాళ్లూ ప్రత్యర్థలు కిరణ్ను టార్గెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది లేదని తేలడంతో ఆయనతో కలిసి వెళ్లేందుకు కొందరు సిద్ధపడుతున్నారట. అదే సమయంలో ఇక నుండి పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తి జాడలు కనిపించకుండా జాగ్రత్త పడాలని కిరణ్ కూడా భావిస్తున్నారట.
మార్పు మంత్రమే ఆయనను ఈ జాగ్రత్తకు పురికొల్పిందని అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్లూ సొంత పార్టీ నుండి విమర్శలు ఎదుర్కొన్న కిరణ్ అదే సొంత పార్టీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నారని, అయితే అది విజయవంతమవుతుందా లేదా తేలాలంటే సమయం పడుతుందంటున్నారు.