'చిల్లర' మాటలు: అది చేదు చేదంటూనే 'చేయి'చ్చారు
న్యూఢిల్లీ: ఎఫ్డిఐలపై లోకసభలో గట్టెక్కిన యూపిఏ రాజ్యసభలోను శుక్రవారం ఒడ్డున పడింది. ఎస్పీ, బిఎస్పీల పరోక్ష, ప్రత్యక్ష మద్దతుతో ప్రతిపక్షాల తీర్మానం వీగిపోయింది. ఓటింగుకు ముందు ఎస్పీ సభ నుండి వాకౌట్ చేసింది. ఎస్పీ మద్దతు ప్రకటించింది. ఎఫ్డిఐలకు అనుకూలంగా 123 ఓట్లు, వ్యతిరేకంగా 109 ఓట్లు వచ్చాయి. లోకసభలో వాకౌట్ చేసిన బిఎస్పీ రాజ్యసభలో ఎఫ్డిఐలకు అనుకూలంగా ఓటేసింది.
ఓటింగు సమయంలో కొద్దిసేపు గందరగోళం చోటు చేసుకుంది. ఓటింగు మిషన్లు పని చేయలేదని కొందరు సభ్యులు చెప్పగా చైర్మన్ రెండోసారి ఓటింగు నిర్వహించారు. నామినేటెడ్, ఇండిపెండెంట్ సభ్యులు యూపిఏకు మద్దతుగా ఓటేశారు. నామినేటెడ్ సభ్యుల్లో సచిన్ టెండుల్కర్ ఒక్కరే హాజరు కాలేదు. ఓటింగుకు ముగ్గురు టిడిపి ఎంపీలు దూరమయ్యారు. లోకసభలో, రాజ్యసభలో గట్టెక్కడంతో ఎఫ్డిఐ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లింది.
చిల్లర వర్తకంలోకి ఎఫ్డిఐలను ఆహ్వానిస్తున్న యూపిఏ ప్రభుత్వానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా పలు రాజకీయ పార్టీలు బహిరంగంగా వ్యతిరేకిస్తూనే సభలో మాత్రం మద్దతు ప్రకటించాయి.
ఎస్పీ, బిఎస్బీల అండతో రాజ్యసభలో ప్రతిపక్షాల తీర్మానం వీగిపోయింది.
ఎఫ్డిఐల రాకతో రాష్ట్రంలోని యువత సేల్స్ బాయ్స్గా సెల్స్ గర్ల్స్గా మారాల్సి వస్తుందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. చిన్న దుకాణాల వారు విదేశీ సంస్థలను ఎదుర్కోలేక ఇబ్బందులు పడతారని చెబుతున్నాయి.
నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) నేత శరద్ యాదవ్ పార్లమెంటులో ఎఫ్డిఐలకు అనుకూలంగా ఉంటూనే తన రాష్ట్రం(మహారాష్ట్ర)లోకి మాత్రం అనుమతించేలేది లేదని చెబుతున్నారు. ఇదేం ద్వంద్వ వైఖరి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
మాయావతి ఎఫ్డిఐలను వ్యతిరేకిస్తూనే లోకసభలో వాకౌట్ చేయడం ద్వారా పరోక్షంగా, రాజ్యసభలో ఓటు వేయడం ద్వారా ప్రత్యక్షంగా యూపిఏకి అండగా నిలిచింది.
ఎస్పీ కూడా ఎఫ్డిఐలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే ఇరు సభల్లో ఓటింగుకు దూరంగా ఉంది. దీంతో పరోక్షంగా యూపిఏకు అండగా నిలిచింది.
ఎస్పీ కూడా ఎఫ్డిఐలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే ఇరు సభల్లో ఓటింగుకు దూరంగా ఉంది. దీంతో పరోక్షంగా యూపిఏకు అండగా నిలిచింది.
డిఎంకె చీఫ్ కరుణానిధి సైతం తాము ఎఫ్డిఐలను ఆమోదించేది లేదని ప్రకటించారు. కానీ ఎఫ్డిఐలకు అనుకూలంగా ఓటేశారు.
లోకసభ ఓటింగులో వ్యతిరేకంగా ఓటేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజ్యసభ ఓటింగులో పాల్గొనలేదు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇంగ్లాండుతో టెస్టు మ్యాచ్ కారణంగా ఓటింగులో పాల్గొనలేదు.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డిఐ)లపై రాజకీయ పార్టీలు తమ రాజకీయ బుద్ధిని స్పష్టంగా బయట పెట్టుకున్నాయి. ఓ వైపు తాము ఎఫ్డిఐలకు వ్యతిరేకం అంటూనే వాటికి మద్దతివ్వడం, పాల్గొనకుండా పరోక్షంగా మద్దతివ్వడం చేస్తుంటే మరొక పార్టీ తమ రాష్ట్రంలోకి వ్యతిరేకిస్తూ... దేశంలోకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు మద్దతు పలుకుతోంది. పార్టీల రాజకీయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయనే వాదన ప్రజల నుండి వినిపిస్తోంది.
తాము ఎఫ్డిఐలను వ్యతిరేకిస్తున్నామని అయితే మతతత్వ పార్టీ అయిన బిజెపికి మద్దతివ్వవద్దనే యూపిఏకి మద్దతిస్తున్నామని మరికొన్ని పార్టీలు చెబుతున్నాయి. అంటే మతతత్వం అనే పేరిట ఆ పార్టీలు దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టేందుకు సిద్ధమయ్యారన్న మాట. అదే నిజమైతే బిజెపిని అన్ని పార్టీల కంటే దూరంగా పెట్టే లెఫ్ట్ పార్టీలు మద్దతిస్తుండగా మిగిలిన పార్టీలకు వచ్చిన నష్టమేంటో తెలియక సామాన్యులు నెత్తి గోక్కుంటున్నారు.
మతతత్వ పార్టీ అన్నది కేవలం కారణం మాత్రమేనని, ఆ పార్టీలు కూడా లోలోపల ఎఫ్డిఐకి మద్దతు పలుకుతూనే ప్రజల మద్దతు కోల్పోకుండా ఉండేందుకు మాత్రమే నెపాన్ని భారతీయ జనతా పార్టీ పైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఎఫ్డిఐలకు తాము వ్యతిరేకమంటూనే పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్న పార్టీల వైఖరి పట్ల ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.