చంద్రబాబు పాదయాత్ర: హోటల్లో టీ, తెలంగాణ సెగ
'చంద్రబాబు గోబ్యాక్', 'తెలంగాణ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి', 'జై తెలంగాణ జైజై తెలంగాణ' అని నినదిస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు ముందుకు దూసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని ముందుకు పోకుండా అడ్డుకుని పక్కకు తోసుకెళ్లారు. ఎబివిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. తన యాత్ర మధ్యలో ఒక వృద్ధురాలు, మరో వికలాంగుడిని పలకరించారు. నాలుగు వేలరూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాక్షస పాలన చేస్తున్నారని, దానికి చరమగీతం పాడాలని ఆయన తన పాదయాత్రలో అన్నారు. ఇల్లు కట్టుకున్నపేదలకు బిల్లులు ఇవ్వడం లేదనీ, ఇల్లు కట్టకుండానే కాంగ్రెస్ నేతలు బిల్లులు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అధికారం అప్పగిస్తే ఇంటికి పెద్దకొడుకులా రాష్ట్ర ప్రజల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేసులు ఎత్తేస్తే జగన్ పార్టీ కాంగ్రెస్లో కలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంతో మంది పేదలు కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారనీ, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామనీ, ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కెసిఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనే బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టారనీ, తాము ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయడంతో దాన్ని తొలగించారని గుర్తుచేశారు.
ఆరు నెలల పాటు కుంభకర్ణుడిలాగా నిద్రపోయి కొంతకాలం తప్పుడు ప్రకటనలు చేస్తూ కెసిఆర్ ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తాడని పేర్కొన్నారు. తెరాస కూడా కాంగ్రెస్లో విలీనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మంత్రి పదవితో చిరు పార్టీ సామాజిక న్యాయాన్ని పక్కన బెట్టి సొంత లాభానికి పరిమితమైందన్నారు. తెలంగాణపై అఖిలపక్షంలో పార్టీ వైఖరి చెబుతామని చెప్పారు.