సమన్వయ భేటీ: ఆజాద్ హాజరు, కావూరి డమ్మా
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదిర్చి ముందుకు సాగడానికి కాంగ్రెసు కీలకమైన నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గులాం నబీ ఆజాద్తో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి, మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు.
రేపు పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం సమన్వయ కమిటీ భేటీ జరిగింది. రేపటి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు తాను హైదరాబాద్ వచ్చినట్లు ఆజాద్ చెప్పారు. సమన్వయ కమిటీ భేటీలో అన్ని విషయాలు చర్చిస్తామని, ఏదైనా భేటీ తర్వాత మాట్లాడుతానని ఆయన భేటీకి ముందు అన్నారు.
కాగా, బొత్స సత్యనారాయమ కావూరి సాంబశివ రావు నివాసానికి వెళ్లినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. సమావేశానికి రావడానికి కావూరి ఇష్టపడలేదని అంటున్నారు. పార్టీతో తాను తెగదెంపులు చేసుకున్నట్లుగానే కావూరి వ్యవహరిస్తున్నారు. ఎఫ్డిఐలపై లోకసభలో తీర్మానం సందర్భంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి కావూరిని ఆహ్వానించారు. దాంతో ఆయన లోకసభకు హాజరై ఓటింగులో పాల్గొన్నారు. మళ్లీ తాను పార్లమెంటుకు రాబోనని ఆయన చెప్పారు.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంతో కావూరి సాంబశివ రావు అలిగి రాజీనామా లేఖలను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, లోకసభ స్పీకర్ మీరా కుమార్కు పంపించారు. తాను కాంగ్రెసు పార్టీలో ఉంటానో ఉండనో అని కూడా అంటున్నారు. బొత్స తనను కలిసి సమన్వయ కమిటీ సమావేశానికి రావాలని పిలిచారని, తాను రానని చెప్పానని కావూరి సాంబశివరావు చెప్పారు. రేపటి విస్తృత స్థాయి సమావేశానికి కూడా తాను హాజరు కావడం లోదని ఆయన చెప్పారు.