బెల్ కొట్టగానే ఆగేందుకు బడి పిల్లలమా?: జయలలిత
తనకు సమయం కేటాయించలేదని ఆరోపిస్తూ జయలలిత జాతీయ అబివృద్ధి మండలి సమావేశం నుండి జయలలిత వాకౌట్ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రులు తమ వాణిని వినిపించకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. ఇంత మాత్రానికే తమను చెన్నై నుండి న్యూఢిల్లీకి పిలవాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు. పది నిమిషాలు పూర్తి కాగానే బెల్ కొట్టి తనను అవమానించారన్నారు.
ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. ఆరు కోట్ల తమిళ ప్రజలకు జరిగిన అవమానమన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రి ఇలా పది నిమిషాలు మాట్లాడాలని నిబంధన పెట్టలేదని ఆమె ధ్వజమెత్తారు. తాను పలు జాతీయ స్థాయి సదస్సులలో పాల్గొన్నానని, కనీసం అరగంట పాటు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. కేంద్రం చర్య సరైనది కాదన్నారు.
కాగా జయలలిత ఆరోపణలు కేంద్రం ఖండించింది. ప్రధాని ప్రసంగం పూర్తి కాగానే జయలలితను ప్రసంగించమని కోరారని, అసలైతే ఆమె వంతు తర్వాతెప్పుడో వచ్చేదని కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా అన్నారు. అందరు కలిసి దాదాపు 35 మంది మాట్లాడాల్సి ఉందని, అందుకే ఒక్కొక్కరికి పది నిమిషాలు కేటాయించామన్నారు. పార్టీతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా అవకాశం ఉంటుందని, అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు.