అలా అయితే సహించం: ఓవైసీ బ్రదర్స్పై జగ్గారెడ్డి
మెదక్ జిల్లా సంగారెడ్డిలో మళ్లీ చిచ్చు పెట్టాలని చూస్తే అంతు చూస్తామన్నారు. ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్, అక్బరుద్దీన్, మజ్లీస్ పార్టీ కార్యకర్తలు పాకిస్థాన్ వెళ్లిపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని, మజ్లీస్ పార్టీకి వ్యతిరేకమని జగ్గారెడ్డి అన్నారు.
మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఓ మతోన్మాది అని, అన్యోన్యంగా ఉన్న దేశ, రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి కలహాలు సృష్టించడానికే ఓవైసీ ఆ వ్యాఖ్యలు చేశాడని నిజామాబాద్ జిల్లా బిజెపి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మత విద్వేషాలను రెచ్చగొడుతున్న అక్బరుద్దీన్ను అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నాయకత్వంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు యెండల, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దొళ్ల గంగారెడ్డి మాట్లాడారు. దేశ ప్రజల్ని కలిచివేసే విధంగా, దేశ సమగ్రతకు సవాలు విసిరే విధంగా అక్బరుద్దీన్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.