కరెంట్ సర్చార్జీలు భారమే, స్థిరాస్తి శాశ్వతం: సిఎం
గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై మహిళలు ముఖ్యమంత్రిని నిలదీశారు. దీనిపై ఆయన స్పందించారు. గ్యాస్ ధర పెంపు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, దీని వెనుక ఏం జరుగుతోందో మీకు తెలియదని, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని బట్టి ధరలు మారుతుంటాయని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని అన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే గ్యాస్ పొదుపుగా వాడుకోవాలనే ఏడాదికి 6 సిలిండర్ల పరిమితిని పెట్టిందని, దానిని సవరించే ఆలోచనలో కేంద్రం ఉందని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచి ప్రజలపై భారం మోపుతుందనే వార్తల్లో నిజం లేదని అన్నారు. విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం త్వరలో పెంచనుందనే వార్తలు కూడా వాస్తవం కాదని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు కేవలం డిస్కంలు చేసిన ప్రతిపాదనలు మాత్రమేనని ఆయన తెలిపారు. ప్రతిపాదనలు రాగానే ప్రజలపై భారం పడుతుందని విపక్షాలు ఆందోళనలు, ధర్నాలు చేయడం సబబుకాదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
డిస్కం ప్రతిపాదనలను తాము మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై మార్చి ఆఖరున మంత్రులు విశ్లేషించి నివేదిక తయారు చేస్తారని, వారి తయారు చేసిన నివేదికపై చర్చించి ఏప్రిల్ 1న తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
అంతకు ముందు దివంగత నేత పి.జనార్ధన్రెడ్డి 65వ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్లోని పిజెఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్బాబు, శశిధర్రెడ్డి,ఎంపీ అంజన్కుమార్ పాల్గొన్నారు.