సమైక్యవాదులది గట్టి వాదనే: అయినా తెలంగాణే?
అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీనాడు చేసిన ప్రకటన సంగతి ఏమిటనే సుశీల్ కుమార్ షిండే వారిని అడిగినట్లు తెలుస్తోంది. వారు ఈ సందర్భంగా డిసెంబర్ 23వ తేదీనాటి ప్రకటనను గుర్తు చేశారని చెబుతున్నారు. డిసెంబర్ 23వ తేదీ నాటి ప్రకటన డిసెంబర్ 9వ తేదీ ప్రకటనను రద్దు చేయలేదని హోం మంత్రి అన్నట్లు సమాచారం. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రకటన చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఆ విషయాలను పక్కన పెడితే, రాజకీయంగా కాంగ్రెసు పార్టీకి రాష్ట్ర విభజన అనివార్యంగా మారినట్లు చెబుతున్నారు. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని దెబ్బ తీసుకోవడం కాంగ్రెసు అధిష్టానానికి ఇష్టం లేదని అంటున్నారు. తెలంగాణ ఇచ్చి, కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో పార్టీ నష్టపోయినా, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచినా పెద్దగా నష్టం ఉండదని అంటున్నారు. తెలంగాణలో సొంతంగా గెలిచే సీట్ల ద్వారా మెజారిటీకి దగ్గరగా వెళ్తే ఇతర పార్టీల నుంచి, అవసరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి కూడా తమకు మద్దతు లభిస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలోని 42 స్థానాల్లో కనీసం సగానికి అటూ ఇటుగా గెలుచుకుంటేనే కేంద్రంలో అధికారానికి చేరువ అవుతామనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పైగా, సీమాంధ్రలో గెలిచే సీట్లపై ఆ ప్రాంత నాయకులు స్పష్టమైన హామీని ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు. దానికితోడు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు తమ పార్టీలో కొనసాగుతుండగా, వారి వారసులంతా వైయస్సార్ కాంగ్రెసులో ఉన్నారనే విషయం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. సీమాంధ్ర నాయకులను నమ్ముకుని సమైక్యవాదానికి మొగ్గు చూపితే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెసు అధిష్టానం విభజనకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.