అరెస్ట్ నామ సంవత్సరం!: జగన్ నుండి శంకరన్న వరకు
హైదరాబాద్: నందననామ సంవత్సరం అరెస్టుల నామ సంవత్సరంగా మారింది! ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రాజకీయ నాయకులు పలు కేసులలో ఇరుక్కుపోయి అరెస్టయ్యారు. చిన్న చిన్న కేసులు మొదలు భారీ అక్రమాలు, భూకబ్జాలు, లంచాలు... తదితర కేసుల్లో మన నాయకులు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో పలువురుకి ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు. మరికొందరికి బెయిల్ దొరికింది. ఇంకొందరు అరెస్టు భయం గుప్పిట్లో ఉన్నారు.
2011లో మన రాష్ట్రానికి సంబంధించిన ఓఎంసి కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయ్యారు. అది అంతకుముందు ఏడాది. అది మొదలు మన రాష్ట్రంలో కూడా నందననామ సంవత్సరంలో అరెస్టుల పరంపర కొనసాగింది. పలువురు అరెస్టు భయంతో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన వాన్ పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత మే 27వ తేదిన అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ అరెస్టయ్యారు. గత డిసెంబర్లో హిందువుల పైన, దేశం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టయ్యారు. జగన్, మోపిదేవి, అక్బర్కు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. 2005లో కలెక్టర్ను దూషించిన కేసులో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ అరెస్టయ్యారు. వివిధ కేసులలో టిడిపి నేతలు యరపతినేని శ్రీనివాస రావు, చిన్నారెడ్డి, సుమన్ రాథోడ్, సుద్దాల దేవయ్య, కోడెల శివ ప్రసాద రావులు అరెస్టయ్యారు.

గత మే 27న వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. బెయిల్ కోసం సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ప్రయత్నాలు చేసినా రాలేదు.

జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గత డిసెంబర్లో అరెస్టయ్యారు. నిర్మల్, అదిలాబాదులలో హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యారు.

కూకట్పల్లిలో భూవివాదం కేసులో సుమన్ రాథోడ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

మజ్లిస్ పార్టీ అధినేత అసద్ 2005లో కలెక్టర్, జెసిలను దూషించిన కేసులో అరెస్టయి బెయిల్ పైన విడుదలయ్యారు.

అనంతపురంలో ఒఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయ్యారు.

గురువారం శంకర రావును పోలీసులు అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చినా.. పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదని విచారించామని చెప్పారు. అయితే రాజకీయ వర్గాల నుండి, దళిత నేతల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతోనే ఆయనను అరెస్టు చేయలేదనే ప్రకటన చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇందులో కోడెల వంటి వారి కేసులు భిన్నమైనవి. అసద్, యరపతినేని, చిన్నారెడ్డి, సుమన్, సుద్దాల, కోడెల తదితరులు బెయిల్ పైన విడుదలయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. విశాఖ కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులపై కూడా పలువురు ఫిర్యాదులు చేశారు.
జగన్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావు అరెస్టు భయంతో ఉన్నారు. మరో నలుగురు మంత్రులు కూడా అదే భయంతో ఉన్నారు. మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి ఓ పాఠశాల నుండి లంచం తీసుకున్న కేసులో ఇరుక్కున్నారు. దర్యాఫ్తు చేయాలని రెండు రోజుల క్రితమే హైకోర్టు వరంగల్ పోలీసులను ఆదేశించింది. నిన్న మంత్రి శంకర రావును పోలీసులు అరెస్టు చేసినా.. దళిత నేతలు, వర్గాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో అరెస్టు చేయలేదని చెప్పారు. తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని కూడా కేసు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications