ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడ: బ్రదర్ అనిల్
మణికొండ ట్రస్టుకు తాను బోధనలు చేయడానికి మాత్రమే వెళ్తానని ఆయన అన్నారు. ఆ భూములను ప్రభుత్వం 1985లో స్వాధీనం చేసుకుందని, ట్రస్టుకు నాలుగు ఎకరాలు కేటాయించింది 2006లో అని ఆయన అన్నారు. ట్రస్టుకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, అది కబ్జా కాదని ఆయన అన్నారు. రక్షణ స్టీల్స్తో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాను మతబోధకుడిని అని, దేవుడిపై నమ్మకం ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు నిరాధారమని, చంద్రబాబుకు మతి భ్రమించినట్లుందని ఆయన అన్నారు.
తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు చేసిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు సిఎం రమేష్, రేవంత్ రెడ్డిలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తమ కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ శానససభలో ఎలా చర్చిస్తారని ఆయన అడిగారు. తమ కుటుంబంపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయి కక్ష సాధిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఆగస్టా హెలికాప్టర్ స్కామ్లో తన పేరు ఇరికించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో కూడా తన పేరును చేర్చేట్లు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఓ కాగితం పట్టుకుని అనిల్ సంతకం అంటూ చెప్తారని, అలా చెప్పే ముందు అతను ఏ అనిలో చూసుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన అన్నారు. దొంగనోట్ల కుంభకోణంలో ఉన్న ఓ వ్యక్తితో చంద్రబాబు ఫొటో దిగాడు, అంత మాత్రాన చంద్రబాబు దొంగనోట్ల కుంభకోణంలో సంబంధం ఉన్నట్లేనా అని అన్నారు. తనకు వ్యాపారాలున్న మాట నిజమేనని, కానీ అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
షర్మిల పాదయాత్ర ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి, షర్మిల, వైయస్ విజయమ్మలపై ఇప్పటి
వరకు ఆరోపణలు చేస్తూ వచ్చారని, ఇప్పుడు తనపై చేస్తున్నారని, తమ కుటుంబాన్ని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని అన్నారు. తమపై రాళ్లు వేస్తే ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని అన్నారు. తాను నిజాయితీగా ఉన్నానని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని అనిల్ స్పష్టం చేశారు. తనను దేవుడు పిలిచాడని, దేవుడు నిలబెట్టాడని, దైవ సేవ చేస్తానని అన్నారు. అధికారంతో ఎవరు ఏం చేసినా సూపర్ పవర్ అనేది ఒక్కటి ఉందని అన్నారు.