భారత్ బంద్: నోయిడాలో వాహనాలు, ఫ్యాక్టరీ దగ్ధం
నోయిడా: భారత బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో బుధవారం హింస ప్రజ్వరిల్లింది. నోయిడాలో వాహనాలను దగ్ధం చేశారు. నోయిడాలోని ఫేజ్ 2లో హోయిసరీ కాంప్లెక్స్ ఎక్కువగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తమ కర్మాగారాల్లోనికి ఆందోళనకారులు చొచ్చుకుని వచ్చి ఆస్తులను ధ్వంసం చేశారని కర్మాగారాల యజమానులు కొందరు ఫిర్యాదు చేశారు.
బుధవారం తెల్లవారు జామున కార్మిక నాయకుడు నరేందర్ సింగ్ మరణించాడు. మృతుడు హర్యానాలోని అంబాలకు చెందిన ఎఐటియుసి కార్మిక నాయకుడు. బస్సులను నడపడానికి ప్రయత్నిస్తున్న డ్రైవర్లను డిపో వద్ద అపడానికి ప్రయత్నించినప్పుడు అతను మృత్యువాత పడ్డాడు. అతన్ని పొడిచి చంపినట్లు అనుమానిస్తున్నారు.
ప్రైవేటీకరణకు, అవుట్ సోర్సింగ్కు, కార్మిక చట్టాల ఉల్లంఘనకు, ధరల పెరుగుదలకు నిరసనగా 11 కార్మిక సంఘాలు 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. మొదటి రోజు సోమవారం బంద్ హింసాత్మకంగా మారింది. నోయిడాలోని కర్మాగారాలపైకి రాళ్లు రువ్వారు, వాహనాలను ధ్వంసం చేశారు. ఓ ఫైర్ ఇంజన్ కూడా ఇందులో కాలిపోయింది. ఏ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణ జీవితంపై బంద్ ప్రభావం పడింది. రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డగించడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. బ్యాంకులు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు చాలా చోట్ల ఇబ్బందులకు గురయ్యారు.