పిఆర్పీ దారేనా?: జగన్కి చిరంజీవి బాధే, టిక్కెట్లాట
2008లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు, టిడిపి కంటే పిఆర్పీ గాలి వీచినట్లుగా కనిపించింది. 2009 ఎన్నికల్లో చిరంజీవి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన అభిమానులతో పాటు ఇతర పార్టీల నేతలూ అభిప్రాయపడ్డారు. చిరు హవా వీయడంతో ఆయన పార్టీలోకి కొత్త నీరు చేరడంతో పాటు పాత పార్టీలకు చెందిన నేతలు క్యూ కట్టారు. చేరిక సమయంలో బాగానే కనిపించినా ఎన్నికల సమయానికి పిఆర్పీ ఇబ్బందులు పడింది.
దాదాపు ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ల కోసం ఎక్కువ మంది క్యూలో సిద్ధమయ్యారు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పిఆర్పీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకోక పోవడానికి ఇదీ ఒక కారమే. నాటి ఎన్నికల్లో పిఆర్పీ డైబ్బై లక్షలకు పైగా ఓట్లను పొందింది. మొదటిసారే ఐదు నుండి ఆరొంతుల శాతం ఓట్లు సాధించింది. చిరంజీవి ఇమేజ్కు ఇది నిదర్శనం. అయితే, ఒకరి కంటే ఎక్కువ టిక్కెట్లు ఆశించడం, టిక్కెట్లు రాని వారు వ్యతిరేకంగా పని చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు జగన్కు కూడా అదే పరిస్థితి ఎదురు కావొచ్చునని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా సీమాంధ్రలో జగన్ పార్టీ హవా వీస్తోంది. దీంతో ఆయన పార్టీలోకి వెళ్లేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇదే జగన్కు ఇబ్బందులను తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. టిక్కెట్ ఆశించి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారు ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్నారు. అయితే, తాజాగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుండటంతో వారికి జగన్ హామీ ఇస్తున్నారట.
దీంతో పాత వారు అసంతృప్తికి లోనవుతున్నారు. తాము ఎప్పటి నుండో టిక్కెట్ పైన ఆశ పెట్టుకొని పార్టీలో ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు 2014 ఎన్నికలకు హామీ ఇవ్వడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దెబ్బలు జగన్ పార్టీకి గతంలోనూ తగిలాయి. ఈ రోజు ప్రకాశం జిల్లా అద్దంకి కార్యకర్తలు తమ నేత గరటయ్యకు కాదని గొట్టిపాటికి టిక్కెట్ ఇవ్వడమేమిటని ఆరోపిస్తూ హైదరాబాద్ కార్యాలయానికి తరలి వచ్చారు.
అయితే, ఈ వ్యవహారం పలు నియోజకవర్గాలలో ఉంది. ఎన్నికల నాటికి ఇది జగన్కు మరింత చిక్కులు తీసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. చిరంజీవి పార్టీలాగే పార్టీలో ఇలాగే టిక్కెట్ల కొట్లాట ఉంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలాగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా నష్ట పోక తప్పదని హెచ్చరిస్తున్నారు.