గజదొంగలను ప్రోత్సహించాడు: వైయస్పై చంద్రబాబు
కాంగ్రెస్ పాలనలో బిసిలకు తీరని అన్యాయం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి వద్ద ఆయన గురువారం పాదయాత్ర ప్రారంభించారు. పెదప్రోలు, కప్టాన్ పాలెం, కాసానగర్, చల్లపల్లి, వక్కలగడ్డ, చిట్టూర్పు మీదుగా 15,1 కిలోమీటర్లు నడిచి వేములపల్లి చేరుకున్నారు. అంతకుముందు - మోపిదేవి ప్రధాన సెంటరులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు.
బిసిలను ఆదుకోవడం కోసం తమ పార్టీ ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు. 50 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామన్నారు. పది వేల కోట్లతో ఉపప్రణాళిక అమలుచేసి బహుజనులందరినీ అభివృద్ధి చేస్తామన్నారు. ఎస్సీలలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని పూడ్సడాని కోసం వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
తమ పార్టీ పాలనలోనే మైనారీటీలకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. నాలుగు శాతం రిజర్వేషన్తో కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నదని విమర్శించారు. తమ పార్టీ పాలనలో సంస్కరణలు బలంగా అమలు జరిగాయని చెప్పారు. తమ హయాంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనే విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహిస్తున్నారని వివరించారు.
అవినీతిరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ప్రజలపై భారాన్ని మోపడం మాత్రమే నేర్చుకున్న ఈ ప్రభుత్వాలు 29 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలుపెంచి ఘనత వహించాయని దుయ్యబట్టారు. చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి మహిళలను వేధించిన వారందరినీ జైలులోనే ఉంచుతామని హామీ ఇచ్చారు.