బాబ్లీపై తీర్పుతో నష్టం లేదు, మంత్రులపై చర్యలు: కిరణ్

పోలవరం ప్రాజెక్టుపై హైపవర్ కమిటీ నివేదిక తన వద్దకు రాలేదని చెప్పారు. పోలవరం టెండర్లపై అనవసర రాద్ధాంతం సృష్టించవద్దని ఆయన సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపేయాలంటూ రాసిన లేఖను కేంద్రం వెనక్కి తీసుకుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. పంట రుణాల మాఫీ సాధ్యం కాదని ఆయన చెప్పారు.
రుణమాఫీపై శాసనసభలో చంద్రబాబును అడుగుతామని చెప్పారు. ఏ పథకాలను తగ్గిస్తారో, ఏ పథకాలను తీసేస్తారో చెప్పాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే స్వాగతిస్తామని చెప్పారు. రైల్వే బడ్జెట్ గతంలో కన్నా బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే 30 ఏళ్లకు కూడా ఇప్పుడు మొదలైన రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన సాధారణ బడ్జెట్ బాగుందని అన్నారు.
విద్యుత్తు చార్జీల పెంపుతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన అన్నారు. ధరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయని అన్నారు. కాంగ్రెసు పార్టీకి, ప్రభుత్వానికి చేటు చేసే మంత్రులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మంత్రులను ఉపేక్షించబోమని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను కలుస్తున్న శాసనసభ్యులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
కాగా, బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అన్యాయంగా ఏమీ లేదని ఆయన శుక్రవారం కరీంనగర్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించి సుప్రీంకోర్టు తీర్పుపై ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాలని ఆయన కోరారు. రైతులపై తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుది కపట ప్రేమ అని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications