జర్మన్ స్త్రీపై రేప్ నిందితుడికి రిమాండ్, ఏడేళ్లు పరారీలో
ఎర్నాకులం: జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో ఏడేళ్ల తర్వాత దొరికిన బిట్టి మహంతిని శనివారం కేరళ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతనిని మొదటి తరగతి జ్యూడిషియల్ మెజిస్ట్రీట్ ముందు హాజరుపర్చారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండును విధించింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై మోసం, ఫోర్జరీ కేసులు పెట్టారు.
కాగా, ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత గతంలో జరిగిన పలు అత్యాచారాల పైన పోలీసుల వైఫల్యాల్ని చెబుతూ పలు టీవి ఛానళ్లు కొన్నింటిని ప్రసారం చేశాయి. అంతేకాకుండా పోలీసులు అత్యాచార, లైంగిక నేరాల కేసుల్లో దోషుల చిత్రాలను పోలీసులు టెలివిజన్, పలు వెబ్ సైట్లలో ఉంచారు. వాటి ద్వారా ఓ పాత నేరగాడు కటకటాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అతనే బిట్టి మహంతి. అతని తండ్రి బిబి మహంతి ఒడిశా మాజీ డిజిపి. బిట్టి మంహంతి ఏడేళ్ల క్రితం రాజస్థాన్లోని అల్వార్లో ఓ జర్మన్ యువతిపై అత్యాచార చేశాడు.
ఫిర్యాదు అందిన పదిహేను రోజులకే అల్వార్లోని కోర్టు అతన్ని దోషిగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుకెళ్లిన అతను ఏడు నెలల శిక్ష అనంతరం తన తల్లికి అనారోగ్మని చెప్పి బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో అతనికి ష్యూరిటీ ఇచ్చిన తండ్రి బిబి మహంతి ఉద్యోగం కోల్పోయాడు. 2006లో పారిపోయిన బిట్టి ఇప్పటి వరకు దొరకలేదు.
ఇదిలా ఉండగా... కేరళలోని కన్నూర్ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ బ్యాంకు ఉద్యోగి రాఘవ్ రాజు. అతను మూడేళ్ల కిందట ఎంబియే పూర్తి చేసి ఎపి నుంచి వచ్చానని చెప్పి బ్యాంకు ఉద్యోగం సంపాదించాడు. మళయాళం నేర్చుకొని బ్యాంగు ఉద్యోగులతో కలిసిపోయాడు. ఇప్పటికి అతను బ్యాంగు ఉద్యోగంలో చేరి మూడేళ్లు అయింది.
నిర్భయ అత్యాచారం నేపథ్యంలో.. ఛానళ్లు, పోలీసులు పాత కేసులను తవ్వుతున్నాయి. నెట్లలో, టివిలలో నేరస్తుల ఫోటోలు కనిపిస్తున్నాయి. వాటిలో రాఘవ్ రాజు ఫోటో కూడా ఉంది. దీనిని గుర్తించిన ఓ సహోద్యోగి.. బ్యాంకు ఉన్నతాధికారులకు చెప్పాడు. వారు పోలీసులకు చెప్పారు. దీంతో రాఘవన్ను కేరళలోని పాళయాంగండిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అతను అత్యాచార కేసులో దోషి బిట్టి మహంతి అని తెలిసింది. అతనికి కోర్డు 14 రోజుల రిమాండు విధించింది.
బిట్టీపై కేసు ఏమిటి?
బిట్టీ మొహంతి 2006లో ఢిల్లీలోని ఓ కాలేజీలో ఎంబిఏ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో జర్మనీకి చెందిన 26 ఏళ్ల యువతి కూడా చదువుతోంది. వాళ్లిద్దరూ స్నేహితులు. ఇద్దరూ కలిసి 2006 మార్చి 20న రాజస్థాన్లోని ఆళ్వార్ వెళ్లారు. అక్కడి హోటల్లో ఇద్దరూ వేర్వేరు రూములు తీసుకున్నారు. కానీ, ఆరోజు రాత్రి జర్మనీ యువతి రూములోకి వెళ్లిన బిట్టీ మొహంతి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాస్ట్ట్రాక్ కేసు ఈ కేసును త్వరితగతిన విచారించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే బిట్టీకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూనే.. తన తల్లి మంచం పట్టిందని, తనను చూడాలనుకుంటోందని విజ్ఞప్తి చేయడం.. ఒడిశాలో డిజిపి స్థాయి అధికారి అయిన ఆయన తండ్రి హామీ ఇవ్వడంతో బిట్టీని పెరోల్పై విడుదల చేశారు. ఆ తర్వాత పారిపోయాడు.