విజయమ్మతో మాట్లాడిందెవరో తెలియదు: బొత్స
అవిశ్వాస తీర్మానంతో సంబంధం లేకుండా క్రమశిక్షణ ఉల్లంఘించిన శానససభ్యులపై చర్యలు తీసుకుంటామని, వివరాలను ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి గానీ ప్రజా సమస్యలపై కాదని ఆయన అన్నారు. బలాబలాలు సభలోనే తేలుతాయని ఆయన అన్నారు. అధికారం కోసమే విపక్షాలు ఏకమవుతున్నాయని ఆయన అన్నారు. అవిశ్వాసంపై ఇతర పార్టీల వైఖరులతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ అంశం సున్నితమైందని, పరిష్కారం కోసం కాంగ్రెసు పార్టీ కృషి చేస్తోందని బొత్స అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గందరగోళం ఉందని, ఓ వైపు యుపిఎకు మద్దతిస్తామంటూనే మరోవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తానని అంటోందని ఆయన అన్నారు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టిందని ఆయన అన్నారు. ఉగాది నుంచి చౌకధరల దుకాణాల ద్వారా 9 నిత్యావసర సరుకులు అందిస్తామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని ఆయన ఆయన వారిద్దరినీ పిలిచారు. ఈ నెల 18 - 21 తేదీల మధ్య రాహుల్ గాంధీ కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు.