తోకపార్టీలకు మద్దతివ్వం: బాబు, నమ్మలేం: మోత్కుపల్లి
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన అవసరం తమకు లేదని, అవినీతి ప్రభుత్వానికి ప్రజాకోర్జులోనే బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను పిలిచే అర్హత ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. డబ్బులు ఆశ చూపి శానససభ్యులను కొంటున్నారని ఆయన ఆరోపించారు.
తెరాస బ్లాక్ మెయిల్ కోసం, వైయస్సార్ కాంగ్రెసు లాలూచీ కోసం అవిశ్వాస తీర్మానాన్ని తెర మీదికి తెచ్చాయని ఆయన విమర్శించారు. ఆ పార్టీలకు కావాల్సింది ప్రజా ప్రయోజనాలు కాదని, వ్యక్తిగత ప్రయోజనాలని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా సాగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ అవినీతి వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన విమర్శించారు.
తాము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్గా చేశామని చెప్పుకున్నారు. చేనేత రంగాన్ని కాంగ్రెసు పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. పావలా వడ్డీ పేరుతో రూపాయి వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలోని మహిళలు తిట్టుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని, దేశంలో ఏ ఉగ్రవాద చర్య జరిగినా హైదరాబాద్తో సంబంధం ఉంటోందని ఆయన అన్నారు.
తెరాసపై తమకు నమ్మకం లేదని, అందుకే ఆ పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వడం లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగ్రెసుతో తెరాస కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. ప్యాకేజీల కోసం ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన అన్నారు.