మాకో లెక్కుంది: చిద్దు, కరుణ షాక్తో కేంద్రంలో సంక్షోభం

బయటి నుండి మద్దతిస్తున్న ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. డిఎంకె పోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోనప్పటికీ ఇబ్బందుల్లో పడటం మాత్రం ఖాయం. ఎస్పీ, బిఎస్పీ ఎంపీలను కలుపుకుంటే యూపిఏ-2కు 273 మంది ఎంపీల మద్దతు ఉంటుంది. లోకసభలో మేజిక్ ఫిగర్ 272. యూపి పార్టీల మద్దతుతో కేంద్రం నెట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బయటి నుండి మద్దతివ్వం
శ్రీలంకలోని తమిళుల హక్కులపై కేంద్రం వైఖరికి నిరసనగా యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తన్నట్లు డిఎంకె చీఫ్ కరుణానిధి ప్రకటించారు. శ్రీలంకకు వ్యతిరేకంగా కేంద్రం రెండు రోజుల్లో సానుకూలంగా ప్రతిస్పందిస్తే తమ నిర్ణయంపై పునరాలోచిస్తామన్నారు. ఐక్య కార్యాచరణ సమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్ ఓటేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీలంక దారుణ నేరాలకు పాల్పడిందన్నారు. తమిళులను అక్కడి ప్రభుత్వం ఊచకోత కోసిందని మండిపడ్డారు. తాము యూపిఏకు బయటి నుండి కూడా మద్దతివ్వమని చెప్పారు. యూపిఏతో బంధాన్ని తెంచుకుంటున్నామన్నారు. తమకు పదవుల కంటే ప్రజలు, ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు.
మా లెక్క మాకుంది
డిఎంకె వైదొలిగినా తమ లెక్క తమకుందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. యూపిఏ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రభుత్వం సుస్థిరంగానే ఉందన్నారు. తీర్మానంపై అఖిల పక్ష అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ముసాయిదా తీర్మానాన్ని అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. సవరణలు చేయవద్దా లేదా అని చూస్తున్నానని చెప్పారు. కరుణానిధిపై తమకు గౌరవముందన్నారు. లోకసభలో తీర్మానం పెడితే పునఃసమీక్షిస్తామని కరుణ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
డిఎంకెపై మాట్లాడను
డిఎంకె తీసుకున్న నిర్ణయంపై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడనని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. శ్రీలంకలో మాన హక్కుల ఉల్లంఘనను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. శ్రీలంక తమిళుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. డిఎంకె నిర్ణయంతో కాంగ్రెసు కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది.
పార్లమెంటులో ఆందోళన
శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో ఉభయ సభల్లో డిఎంకె ఆందోళన చేపట్టింది. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ సభ్యులు లోకసభలో నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాజ్యసభలోను ఆందోళన చేయడంతో మధ్యాహ్నానికి చైర్మన్ సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications