కనుసైగతో ఆపారు: షర్మిల, 'బ్రదర్ టార్గెట్ అయ్యారు'
కేంద్రం చేతిలో సిబిఐ కీలుబొమ్మ అనే విషయం మరోసారి తేటతెల్లమయిందన్నారు. సాక్ష్యాత్తూ మాజీ సిబిఐ డైరెక్టర్ జోగిందర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. స్టాలిన్ ఇంట్లో సిబిఐ సోదాలు జరపటం.. నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం కనుసైగ చేయడంతో సోదాలు ఆపేసిందని షర్మిల విమర్శించారు. షర్మిల పాదయాత్రలో ఈ రోజు జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి పాల్గొన్నారు.
యూపిఏ చేతిలో సిబిఐ కీలుబొమ్మగా మారిందని మరోసారి రుజువయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సోమయాజులు హైదరాబాదులో విలేకరుల సమావేశంలో అన్నారు. స్టాలిన్ నివాసంపై సిబిఐ దాడులే అందుకు నిదర్శనం అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు సిబిఐని కాంగ్రెసు ఉపయోగించుకుంటోందన్నారు. కాంగ్రెసుకు రాజకీయాల పార్టీల కంటే సిబిఐనే గట్టి మద్దతిస్తోందని దెప్పిపొడిచారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం చెప్పుచేతల్లో పని చేస్తోందని విమర్శించారు. వీరభద్రా రెడ్డి మృతితో షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. త్వరలో టిడిపి ప్రోత్సాహంతో అనిల్ కుమార్ను లక్ష్యంగా చేసుకునే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు టిడిపి-కాంగ్రెసులు కలిసి పని చేస్తున్నాయన్నారు.