ఏం చేస్తామో చూస్తారు, కింగ్ మేకర్లం: అఖిలేష్ షాక్
యూపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో తొలిసారిగా ఆదివారం ఆయన ఆజ్ తక్ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఏం జరుగుతుందో త్వరలోనే చూస్తారని, యూపిఏ నాయకత్వం కాళ్ల కింద కుర్చీని ఎప్పుడు లాగేయాలో తమ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సర్కారును పడగొట్టేసిన తర్వాత ఏం చేయాలనే దానిపై ఇప్పటికే తమ రాజకీయ కార్యాచరణ సిద్ధమైపోయిందని చెప్పారు.
ఎప్పుడైనా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, లోక్సభ ఎన్నికలు అక్టోబర్లోనే జరిగితే తమకు కలిసి వస్తుందని, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా తాము సిద్ధమే అన్నారు. ఎన్నికల తర్వాత తామే కింగ్ మేకర్లం అన్నారు. అసమ్మతి భాగస్వామ్య పక్ష నేతలైన ములాయంసింగ్ యాదవ్, మాయావతి తదితరులను దారిలోకి తెచ్చుకునేందుకు కేంద్రం సిబిఐ భూతాన్ని చూపి భయపెడుతోందన్న వాదనపైనా ఆయన స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ సిబిఐని చూపించి మమ్మల్ని భయపెట్టలేదని, లొంగదీసుకోలేదని, దాని నుంచి తమకు ఎటువంటి ఒత్తిళ్లు లేవన్నారు. మతతత్వ శక్తులను దూరంగా ఉంచడానికే యూపిఏకు మద్దతిచ్చామని, తొలి నుంచీ ఇదే తమ వైఖరి అన్నారు. బద్ధ శత్రువులైన రెండు ప్రధాన పార్టీల (ఎస్పీ, బిఎస్పీ) మద్దతుతో కేంద్రంలోని మైనారిటీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, భారత రాజకీయాల్లో ఇదే అతి పెద్ద ద్వంద్వ వైఖరి అని వ్యాఖ్యానించారు. నూట పాతికేళ్ల కాంగ్రెస్ పార్టీ అసలైన రాజకీయ ముఖచిత్రం ఇదేనని అభిప్రాయపడ్డారు.