ములాయంతో చంద్రబాబు: ఇటు జగన్, అటు కెసిఆర్!
42 పార్లమెంటు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో కీలకం. ఇలాంటి సమయంలో ములాయం సింగ్ మరోసారి యూపిఏ, ఎన్డీయేతర పార్టీలతో మూడో ఫ్రంట్కు తెరలేపారు. ములాయం థర్ట్ ఫ్రంట్ వ్యాఖ్యల పైన మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రం నమ్మకంగా లేవు.
జాతీయస్థాయిలో అటు ఎన్డీయే ఇటు యూపిఏకు మద్దతివ్వలేని పరిస్థితుల్లో ఉన్న టిడిపి మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తోంది. బిజెపి, కాంగ్రెసులు కాకుండా మరో ఫ్రంట్ ఏది వచ్చినా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి చెబుతోంది. ములాయం ఫ్రంట్ ఏర్పాటు చేసినా అందుకు సిద్ధంగానే ఉంది. గతంలో థర్డ్ ఫ్రంట్లో తెలుగుదేశం, సమాజ్వాది పార్టీలు ఉన్నాయి. దీంతో వారు మరోసారి కలిసే అవకాశాలు ఉన్నాయి.
అయితే, జగన్ పార్టీ, తెరాసలు మాత్రం థర్డ్ ఫ్రంట్ను కొట్టిపారేస్తున్నారట. థర్డ్ ఫ్రంట్ అనేది విఫల యత్నమని, అలాంటి దాంతో వెళ్లేందుకు ఇష్టం లేదని తెరాస చెబుతోందట. అంతేకాకుండా థర్డ్ ఫ్రంట్ తెలంగాణకు వ్యతిరేకమని, అలాంటప్పుడు తాము దాంతో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ములాయం సింగ్ యాదవ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటారని తెరాస భావిస్తోంది. ఈ కారణంగా థర్డ్ ఫ్రంట్కు మద్దతిచ్చే అవకాశాలు లేవు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న ఎన్డీయే వైపు వెళ్లక తప్పదంటున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా టిడిపి ప్రధానంగా ఉండే థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే కలిసే అవకాశాలు లేవు. గతంలో థర్డ్ ఫ్రంట్ విఫలమైందని, ఇప్పుడు కూడా అది సాధ్యం కాదేమోననే అభిప్రాయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందట. మరో ఫ్రంట్కు మద్దతిస్తామని జగన్ పార్టీ చెప్పినా టిడిపి ఉండే ఫ్రంట్లో ఉండే అవకాశాలు లేదు. బిజెపికి మద్దతివ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసు ఆధ్వర్యంలోని యూపిఏ తప్ప మరొకటి లేదంటున్నారు.