సోదరి పెత్తనానికి తండ్రి మద్దతు: బిలావల్ అలక, సౌదీకి
పార్టీ వ్యవహారాలలో తండ్రితోపాటు సోదరి ఫర్యాల్ తాల్పూర్ తన మాటకు విలువ ఇవ్వడం లేదంటూ అలిగిన బిలావల్ దుబాయ్ వెళ్లిపోయారు. బిలావల్ను తమ ప్రధాన ప్రజాకర్షక ప్రచారకుడుగా భావిస్తున్న పార్టీ నేతలు ఈ పరిణామంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పిపిపిలో ముసలం ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక, యువత సమస్యల పట్ల పార్టీ స్పందనల తదితర విషయాలలో పార్టీ అనుసరిస్తున్న తీరుపై బిలావల్కు, జర్దారీకి విభేదాలు తలెత్తాయి. తన సూచనలు బేఖాతరు చేయడాన్ని నిరసిస్తూ ఇరవై నాలుగేళ్ల బిలావల్ దుబాయ్కి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా భావిస్తున్న బిలావల్ వెళ్లిపోడంతో సంప్రదాయ ఓట్ బ్యాంకు దూరమయ్యే ప్రమాదం నెలకొందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
పార్టీ వ్యవహారాల్లో తనను పక్కన పెట్టి సోదరి ఫర్యాల్ సూచనలకు జర్దారీ ప్రాధాన్యం ఇవ్వడం సహించలేకపోయాడు. సింధ్ రాష్ట్రంలో బిలావల్ సూచించిన అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చేందుకు ఆయన సోదరి అడ్డుపడ్డారు. ఈ వ్యవహారంలో జర్దారీ తన కుమార్తెను సమర్థించారు. దీంతో బిలావల్ అలిగాడు. మరింత రాజకీయ పరిణితి చెందిన తర్వాత బాధ్యతలు అప్పగిస్తానని జర్దారీ చెప్పినా బిలావల్ వినలేదు. తనకు అవకాశం వస్తే పిపిపికి ఓటు వేయబోనని చెప్పి మరీ వెళ్లిపోయాడు. అయితే, విభేదాల వార్తలను గిలానీ కొట్టిపారేశారు. తమ కుటుంబాల్లో పిల్లలు పెద్దలను గౌరవిస్తారన్నారు.