ఉత్పత్తి సున్నా': జగన్ పార్టీకి ట్విట్టర్లో లోకేష్ చురక
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ విషయాన్ని తెలుసుకోవాలని, 2004-2009 మధ్యలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్క మెగావాట్ ఉత్పత్తి కూడా కొత్తగా సాధించలేదని ట్వీట్ చేశారు. పైగా 26-06-09 నుంచి ఎఫ్ఎస్ఏ వసూలుకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
ప్రజలపై ఎఫ్ఎస్ఏ భారాన్ని మోపడం మొదలు పెట్టింది వైయస్సేనని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలకు మద్దతుగా ప్రభుత్వ ఉత్తర్వు ప్రతిని జత చేశారు. ఎఫ్ఎస్ఏ చార్జీల వసూలుకు అనుమతిస్తూ వైయస్ సర్కారు 2009లో ఆదేశాలిచ్చిందని, ఈ మేరకు ఈఆర్సి ముందు ప్రతిపాదనలు ఉంచాలని డిస్కంలను ఆదేశించిందని ఈ ఉత్తర్వుల్లో ఉంది.
భారం ఎవరు భరిస్తారు!?: ముద్దు
"200 యూనిట్ల వరకూ విద్యుత్ చార్జీల భారం తగ్గించామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. కానీ, ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పడం లేదు. ప్రభుత్వం భరించకుండా డిస్కంలకు వదిలి వేస్తే అవి మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట జనాన్ని బాదుతాయి. తగ్గింపు భారం ఎవరు భరిస్తారో.. ఎలా భరిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి'' అని టీడీపీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు.
50 యూనిట్లలోపు గతంలో కూడా పెంచలేదని, ఆపైన 200 యూనిట్లలోపు వారికి ఇచ్చిన ఉపశమనం కూడా స్వల్పమని, ఆ కేటగిరీల్లో లబ్దిదారులు తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. "గ్రామ పంచాయితీల మంచినీటి పథకాలకు, రైతుల ఎత్తిపోతల పథకాలకు, మునిసిపాలిటీల్లో వీధి లైట్లకు, చిన్న తరహా పరిశ్రమలకు పెంచారు. వాటికి చార్జీల తగ్గింపు గురించి మాట్లాడటం లేదు. వీటిపై ప్రభుత్వం స్పందించే వరకూ మా పోరాటం ఆగదు'' అని ఆయన స్పష్టం చేశారు.