చిన్నారి శ్రాగ్వి కిడ్నాప్ కథ సుఖాంతం: కేసులో ట్విస్ట్
శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో శ్రాగ్వి అదృశ్యమైందని, విషయం తెలియడంతో తాము కలత చెందామని అనురాగ్ శర్మ చెప్పారు. పాప కిడ్నాపైందని తెలిసి బాధపడ్డామన్నారు. పాపను వారి కుటుంబానికి సన్నిహితుడైన రావుల భరత్ కిడ్నాప్ చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. అయితే, పాప దొరకగానే తల్లిదండ్రులకు అప్పగించాలనే ఉద్దేశ్యంతో వెంటనే వారికి అప్పగిస్తున్నామన్నారు.
కేసును పూర్తిగా దర్యాఫ్తు చేయాల్సి ఉందన్నారు. రావుల భరత్ అనే వ్యక్తి శ్రాగ్విని కిడ్నాప్ చేసి తన ఇంటిలో దాచి పెట్టారని, దానిని తాము కనుగొని పాపను తీసుకు వచ్చామని, నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. కేసును చేధించిన వారిని సిపి అభినందించారు. శ్రాగ్వి తల్లి సృజన గతంలో రెడ్డీస్ ల్యాబ్లో పని చేశారని, అదే కంపెనీలో పని చేసిన భరత్కు వారి కుటుంబంతో ప్రెండ్ షిప్ ఏర్పడింది.
ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భరత్ కిడ్నాప్ చేయడం విశేషం. దీనిపై సిపి మాట్లాడుతూ... కిడ్నాప్కు కారణాలు తెలియలేదని, నిందితుడిని ప్రశ్నించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. అసలేం జరిగిందో ఎందుకు జరిగిందో విచారిస్తామన్నారు. కిడ్నాపర్లలో భరత్ మానసిక సమస్యల్లో ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. భరత్కు పెళ్లై పిల్లలు పుట్టక పోవడంతో భార్యకు విడాకులిచ్చారు. దీంతో అతను మానసిక సమస్యల్లో ఉన్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు.