నాగార్జున టార్గెట్: వైఎస్ టైంలో ప్రచారమని రేవంత్ ఫైర్
2007 నుంచే వైయస్ రాజశేఖర రెడ్డి నుండి నాగార్జున ప్రత్యేక రాయితీలు పొందారని ఆరోపించారు. అందుకే 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేశారని విమర్శించారు. అన్ని ఒప్పంద పత్రాలు సరిగా ఉన్నాయని చెప్పిన నాగార్జున అన్నపూర్ణ ఒప్పంద పత్రాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
కిరణ్ ఇప్పుడు తప్పించుకున్నారు కానీ..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులతో రాష్ట్రాన్ని పాలించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడించపోయిన తమ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడం దారుణం అన్నారు. పోలీసుల సాయంతో సిఎం ముట్టడిని తప్పించుకున్నారని, అసెంబ్లీలో ఎలా తప్పించుకుంటారో చూస్తామని హెచ్చరించరు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవిభక్త కవలలు అన్నారు.
టిడిపి నేతల అరెస్ట్
కళంకిత మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు సిఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకొని గోల్కోండ పోలీసు స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో నేడు పర్యటించనున్న కిరణ్ను అడ్డుకుంటారని భావించిన పోలీసులు జిల్లాలో టిడిపి నేతలను నిర్బంధించారు.