షర్మిలకు క్యారెక్టర్ లేదు, పట్టించుకోను: చంద్రబాబు

తండ్రి అధికారం చేపట్టిన తర్వాత లక్ష కోట్ల ప్రజాసంపదను జగన్ దోచుకున్నాడని ఆయన ఆరోపించారు.
గత తొమ్మిదేళ్లలో జగన్ సంపాదించిన ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలా చేస్తే భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడరని చెప్పారు. విశాఖ జిల్లాలో 'వస్తున్నా మీకోసం' యాత్ర నిర్వహిస్తున్న ఆయన గురువారం పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బసచేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఇన్చార్జులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేవారమని, కానీ ఈసారి ముందే ప్రకటిస్తామని చెప్పారు. విజయావకాశాలు లేనివారికి టిక్కెట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు. నియోజకవర్గ ఇన్చార్జులకే టిక్కెట్లు ఇస్తానని తానెక్కడా అనలేదని, గత ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయినచోట్ల పార్టీ పటిష్ఠం కావడానికే ఇంచార్జులను నియమించామని చెప్పారు.
ఇంచార్జీల్లో కొందరు బస్సులో సీటు కోసం తువ్వాలు వేసిన చందంగా టిక్కెట్టు తమకే అన్నట్టు ధీమాగా ఉంటున్నారని, వాళ్లు పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకున్న వారే నిజమైన ఇన్చార్జులని, కష్టపడి పనిచేసేవారికే టిక్కెట్లిస్తానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో చట్టాలను అమలుచేయాల్సిన హోంమంత్రి సబితారెడ్డి ఓ నేరస్థురాలని, ఓబుళాపురం గనుల కేసులో ఆమె ఏ-4 నిందితురాలని గుర్తు చేస్తూ ఇలాంటి వారు మంత్రులైతే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications