సరబ్ మృతి: పోస్టుమార్టం నివేదికలో నమ్మలేని నిజాలు
జైపూర్: పాకిస్తాన్ జైలులో ఇతర ఖైదీల చేతిలో గాయపడి మృతి చెందిన సరబ్జిత్ సింగ్ను అత్యంత దారుణంగా కొట్టారని వైద్యుల నివేదికలో వెల్లడయింది. సరబ్ను తీవ్రంగా కొట్టి చంపారని వైద్యులు అభిప్రాయపడ్డారు. సరబ్ మృతదేహానికి ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు గుర్జిత్మాన్ తీవ్రమైన గాయాల వల్లే మృతి చెంది ఉండవచ్చునని చెప్పారు.
ఫోరెన్సిక్ నివేదిక రేపు వస్తుందన్నారు. తల వెనుక భాగంలో బలమైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు ఉన్నాయని, సరబ్జిత్ గుండె, కాలేయం, మూత్ర పిండాలకు కూడా తీవ్ర గాయాలున్నాయని చెప్పారు. సరబ్ పక్కటెముకల్లో ఐదు పూర్తిగా విరిగిపోయాయని చెప్పారు. తల, చెవులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. పొట్టలోని భాగాలు మాయమయ్యాయని చెప్పారు. పుర్రె చిట్లిపోయిందన్నారు.

సరబ్ అంత్యక్రియలు పూర్తి
సరబ్జిత్ సింగ్ అంత్యక్రియలు పంజాబ్లోని తరన్తరాన్ జిల్లా బిఖీవింద్లో జరిగాయి. సరబ్జిత్ సింగ్కు అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో సరబ్జిత్ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తరలించారు. సరబ్జిత్ అంత్యక్రియల్లో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ తదితరులు పాల్గొన్నారు.
పాక్ జెండా దహనం
సరబ్జిత్ సింగ్ను పాకిస్తాన్ ప్రభుత్వం చంపించిందని ఎబివిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ కుట్రను నిరసిస్తూ ఆ దేశ జెండాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు తగులబెట్టి నిరసన తెలిపారు. ప్రపంచం ముందు పాక్ను దోషిగా నిలబెట్టాలని విదేశాంగ మంత్రిని, కేంద్రాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications