చిరును సిఎం చేయాలనే, కుల బలంతో శాసించాం: సిఆర్
గురువారం ఫ్యాప్సీలో జరిగిన ఐక్యకాపునాడు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కన్నబాబు, తోట త్రిమూర్తులు, బండారు సత్యానందం, కాపునాడు సీనియర్ నేతలు మిరియాల వెంకట్రావు, పిళ్లా వెంకటేశ్వరరావు, మిరియాల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో కాపులు బలమైనశక్తిగా అవతరించాలంటే అన్ని వర్గాలను కలుపుకుని పోవాలన్నారు. రాష్ట్రంలో అసంఖ్యాకంగా ఉన్న కాపు సామాజికవర్గంపై కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే సమయంలో తాను, చిరంజీవి 40 నిమిషాల పాటు సోనియాతో మాట్లాడామని, కాపులను బిసీల్లో చేర్చాలని కోరామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి చిరంజీవి ఆ విషయాలు బయటకు చెప్పుకోలేరని ఆయన అన్నారు.
కులముద్రను బహిరంగంగా వేసుకున్న ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం నాశనమైందని, తమకు కులం అంటే అభిమానం ఉందని, జిల్లా మంత్రులూ ఎమ్మెల్యేల పెత్తనంతో కొన్నిసార్లు కులానికి చెందినవారికి న్యాయం చేయలేకపోతున్నామని, అంత మాత్రాన తమపై విమర్శలూ ఆరోపణలూ చేయడం సరి కాదని ఆయన అన్నారు.