స్పాట్ ఫిక్సింగ్: దావూద్ మనిషి సునీల్ దుబాయ్
డబ్బుల చెల్లింపునకు ఎంచుకున్న హవాలా మార్గం దావూద్ ముఠా హస్తం స్పాట్ ఫిక్సింగ్ వెనక ఉందనడానికి కారణమని అంటున్నారు. డబ్బా ఫోన్ల స్వాధీనం ఈ విషయాన్ని బయటపెట్టినట్లు కూడా చెబుతున్నారు. దుబాయ్ - కరాచీ లింక్ గురించి ఢిల్లీ పోలీసు కమీషనర్ నీరజ్ కుమార్ పెద్దగా వివరాలు అందించలేదు. విదేశాల్లో నివసిస్తున్న ముంబై అండర్ వరల్డ్ పాత్ర ఉందని చెప్పారు.
బుకీ కింగ్పిన్ దుబాయ్ నెంబర్ వాడాడా, లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. కరాచీ, దుబాయ్, జైపూర్, కోల్కతా, అహ్మదాబాద్లకు సంబంధాలు కొనసాగించినట్లు చెబుతున్నారు. సునీల్ దుబాయ్ 20 ఏళ్ల క్రితం ముంబైలో తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. దుబాయ్, ముంబై మధ్య తిరుగుతూ సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవాడని చెబుతున్నారు.
బెట్టింగు కేసుల్లో అతని పేరు ముందుకు రావడంతో పోలీసులు గతంలో లుకవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచే అతను ముంబై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. గత నెలలో ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దావూద్ మనిషి అయిన శరద్ శెట్టి నుంచి సునీల్ దుబాయ్ బెట్టింగ్ వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.