వడదెబ్బ: అమ్మతో మాట్లాడి.. కూర్చున్న సీట్లోనే మృతి
రాష్ట్రంలో అత్యధికంగా పాల్వంచలో 49, కొత్తగూడెంలో 48, రెంటచింతలలో 47.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం పదిరోజులుగా ఎండ వేడిమి పెరుగుతోంది. గురువారం ఈ తీవ్రత మరింత అధికమైంది. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది, కూలీలు, కర్మాగారాల్లో పని చేసేవారు విలవిల్లాడుతున్నారు. బయట అడుగు పెట్టేందుకే జనం భయపడుతున్నారు. పల్లెల నుంచి పట్టణాల దాకా మధ్యాహ్నం పూట వీధులు దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
అడుగు బయటపెట్టకుండా ఇళ్లలో ఉన్న వారు కూడా శరీరం వెచ్చగా ఉండడం, కళ్లమంటలు, నీరసం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు రాష్ట్రమంతా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ మించి నమోదయ్యాయి. గోదావరి జిల్లా ఏలూరులో కూడా పాదరసం 48 డిగ్రీలను తాకింది. వరంగల్ జిల్లాలోని గణపురం మండలం కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏకంగా 49.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
కూర్చున్నచోట కూర్చున్నట్లే...
కరీంనగర్ జిల్లాకు చెందిన పద్దెనిమిదేళ్ల రాకేష్ రెడ్డి పరీక్ష రాసేందుకు వరంగల్ వచ్చి ఇంటికి వెళ్తూ వడదెబ్బకు బస్సులో కూర్చున్న సీట్లో అలాగే మృతి చెందాడు. వరంగల్లో ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్న రాకేష్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసి తిరిగి కరీంనగర్ వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. కరీంనగర్ సమీపంలోని మానకొండూరు వచ్చాక, తాను అరగంటలో ఇంటికి చేరుతానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కరీంనగర్ వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తనకు ఏదో అవుతుందంటూనే సీట్లోనే ఒరిగిపోయాడు. ప్రయాణీకులు వెంటనే 108కి సమాచారం అందించారు. బస్టాండుకు చేరిన తర్వాత పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.